Hyderabad: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోం.. కూతురి గోల్డ్‌ చైన్‌ విషయమై భర్తతో గొడవ... దాంతో..

18 Feb, 2022 09:58 IST|Sakshi
చంద్రశేఖర్, దీపిక దంపతులు (ఫైల్‌) 

నాచారం పీఎస్‌ పరిధిలో దారుణం

కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్న పోలీసులు

సాక్షి, మల్లాపూర్‌(హైదరాబాద్‌): కుటుంబ కలహాలతో మనస్తాపానికిలోనైన ఓ మహిళ కుమార్తెను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ కిరణ్‌కుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం విలేజ్‌కు చెందిన తెలుగు మద్దిలేటి, ఉమాదేవి దంపతుల కుమారుడు  చంద్రశేఖర్‌కు, జమ్మిగడ్డ శ్రీశివసాయినగర్‌కు చెందిన దీపిక అలియాస్‌ చందన (27) 2019లో వివాహం జరిగింది.

వీరికి రుత్విక(01) కుమార్తె ఉంది. చంద్రశేఖర్‌ అమీర్‌పేట్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నాడు. ఈ నెల  4న రుత్విక బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తగారు పాపకు పెట్టిన బంగారు గొలుసు విషయమై భార్యాభర్తల మధ్య తరచు గొడవ జరుగుతున్నట్లు సమాచారం.

గురువారం ఉదయం రెండో ఫ్లోర్‌లో చంద్రశేఖర్‌ పని చేసుకుంటున్నాడు. మొదటి అంతస్తులో పాప ఏడుస్తుందని కిందకు వచ్చిన దీపిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకొని పాప మొహంపై దిండుతో అదిమి చంపివేసింది. అనంతరం ఉయ్యాల తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం కిందకు వచ్చిన చంద్రశేఖర్‌ సోదరుడు డోర్‌ కొట్టగా ఎంతకు తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా దీపిక ఉరివేసుకుని కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి హుటాహుటిన  తల్లిబిడ్డలను నాచారం ప్రసాద్‌ ఆస్పత్రికి తరలించారు.
చదవండి: సర్కారు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాచారం పోలీసులు మృతురాలి భర్త, మరిది, అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీసీపీ రక్షితా కె మూర్తి, ఏసీపీ శ్యామ్‌ప్రసాద్‌రావు  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

భర్తే చంపాడు.. 
చంద్రశేఖర్‌ తన కూతురిని, బిడ్డను హత్య చేశాడని దీపిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి వద్దే చంద్రశేఖర్‌ కుటుంబసభ్యులపై వారు దాడి చేశారు. 

మరిన్ని వార్తలు