అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత 

13 Oct, 2023 05:08 IST|Sakshi

గన్నవరం: కృష్ణాజిల్లాలోని గన్నవరంలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న కారులో ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు వంద కిలోల గంజాయిని కేంద్ర ప్రత్యేక బృందం పట్టుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. స్థానిక సెయింట్‌జాన్స్‌ హైసూ్కల్‌ సమీపంలోని విద్యానగర్‌లో ఓ ఇంటిని ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయ వ్యాపారం చేసే రాజస్థాన్‌కు చెందిన కుటుంబం మూడు నెలల క్రితం అద్దెకు తీసుకుంది. వీరి ఇంటికి గురువారం రాజస్థాన్‌కు చెందిన నలుగురు యువకులు కారులో వచ్చారు.

ఆ కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక బృందం దాడి చేసింది. అయితే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్న నలుగురు యువకుల్లో.. అధికారుల రాకను గమనించి ఇద్దరు గోడ దూకి పరారయ్యారు. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ ఇద్దరు యువకులను, గంజాయి ఉన్న కారును విజయవాడకు తరలించి విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు