ప్రేమను ఒప్పుకోలేదని.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో..

15 Sep, 2021 18:54 IST|Sakshi
నిందితుడు దిలీప్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: తనతో కలిసి పనిచేసే సహోద్యోగిని ప్రేమిస్తున్నానని వెంట తిరిగాడు. లవ్‌ చేస్తున్నానని ప్రపోజ్‌ చేశాడు. కానీ, యువతి ఒప్పుకోకపోవడంతో కక్షగట్టి అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. సదరు అమ్మాయి రాచకొండ సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ బీ.ప్రకాశ్‌ కేసు దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా శ్రీనగర్‌ కాలనీకి చెందిన గంజి దిలీప్‌ కుమార్‌(27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదే కంపెనీలో బాధితురాలు కూడా పనిచేస్తోంది. ఉద్యోగంలో భాగంగా సన్నిహితంగా ఉండటం చూసి అపార్థం చేసుకున్న దిలీప్‌.. 2019లో ప్రేమిస్తున్నాను చెప్పాడు. కానీ, ఆమె ఒప్పుకోలేదు. అప్పటి నుంచి దిలీప్‌తో మాట్లాడటం లేదు. ఉద్యోగం కూడా మానేసింది.

దీన్ని జీర్ణించుకోలేక పోయిన దిలీప్‌ ఆమెపై పగ పెంచుకుని ఎలాగైనా ఆమె అప్రతిష్టపాలు చేయాలని పథకం పన్నాడు. జూన్‌ నెలలో అమ్మాయి ఇన్‌స్ట్రాగామ్‌ ఐడీని హ్యాక్‌ చేసి, తన వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా చిత్రికరీంచి, కామెంట్లతో నెట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. తన ఇన్‌స్ట్రాగామ్‌ హ్యాక్‌ అయిందని గమనించిన బాధితురాలు సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో అన్ని రకాల సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్‌ చేశారు. జ్యూడీషియల్‌ కస్టడీ కోసం కోర్టు ఎదుట హాజరుపరిచారు. నిందితుడి దగ్గర్నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: చెప్పులను పట్టుకోవాలని.. చెరువులోకి వెళ్లిన ఇద్దరు బాలురు
నాడు 15 రోజులపాటు వాహనంపైనే ఖైరతాబాద్‌ గణేషుడు.. కారణం ఇదే!

మరిన్ని వార్తలు