రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌, ఆర్‌ఐ

24 Sep, 2023 17:39 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : అదిలాబాద్ జిల్లాలో  రెవెన్యూ  అదికారులు అడ్డగోలుగా  వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. అదివారం సెలవు దినం కూడా వదిలిపెట్టడం లేదు. పట్టాపాసు పుస్తకంలో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్‌, ఆర్‌ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన జిల్లాలోని మావల మండలంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. అదిలాబాద్‌కు చెందిన యతీంద్రనాథ్ అనే రైతు మావల సమీపంలోని 14 ఎకరాల భూమికి సంబంధించి నాలుగు పాసు పుస్తకాల్లో మార్పుల కోసం మావల తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాడు. ఇందుకు ఎమ్మార్వో  అరీఫా  సుల్తానా,  ఆర్‌ఐ హన్మంతరావు రెండు లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు.  చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్లాప్లాన్‌తో తహసిల్దార్ ఆరిఫాసుల్తానా, ఆర్ఐ హనుమంతరావుకు మావల తాహసీల్దార్ కార్యాలయంలో రెండు లక్షలు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ‘వారంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితా’

మరిన్ని వార్తలు