హైదరాబాద్‌లో దారుణం.. క్లాస్‌మేట్‌పై అఘాయిత్యం.. రహస్యంగా వీడియో చిత్రీకరించి..

8 Jun, 2023 09:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హిమాయత్‌నగర్‌(హైదరాబాద్‌): కాల్‌మనీ తరహా ఉదంతం హైదరాబాద్‌ నడిబొడ్డున చోటుచేసుకుంది. ఎంబీఏ విద్యార్థినికి అప్పు ఇచ్చిన ఆమె క్లాస్‌మేట్‌ తిరిగి చెల్లించలేకపోవడాన్ని అదునుగా భావించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. షీ టీమ్‌ ద్వారా వివరాలు తెలుసుకున్న నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నారాయణగూడలోని ఓ కళాశాలలో ఎంబీఏ ఫస్టియర్‌ చదువుతున్న యువతి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కొన్ని నెలల క్రితం తన క్లాస్‌మేట్‌ నుంచి డబ్బు తీసుకుంది.

నిర్ణీత సమయంలో ఆ యువతి ఈ బకాయి తీర్చలేకపోయింది. దీంతో అతడు ఎట్టి పరిస్థితుల్లో వెంటనే నగదు చెల్లించాలంటూ ఒత్తిడి చేసి ఆమెను నిస్సహాయురాలిని చేశాడు. ఆ డబ్బు అడగకుండా ఉండాలంటే తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు. గత్యంతరం లేని ఆమె అంగీకరించడంతో కొన్ని రోజుల క్రితం నారాయణగూడలోని ఓయో రూమ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా ఉండగా సదరు యువకుడు రహస్యంగా వీడియో చిత్రీకరించాడు.

దాన్ని మరుసటి రోజు తన స్నేహితులకు చూపించాడు. అప్పటి నుంచి ఇతడితోపాటు మరో నలుగురు యువకులు తమ కోరిక తీర్చాలంటూ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలెట్టారు. అలా చేయకుంటే వీడియో వైరల్‌ చేస్తామని బెదిరించారు. ఆ యువతి ఒప్పుకోకపోవడంతో ఆ వీడియోను వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశారు.
చదవండి: అతనికి కుటుంబమే ప్రాణం.. మరి గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడంటే..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పేజ్‌ క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేశారు. మానసిక క్షోభకు గురైన యువతి ఇటీవల షీ టీమ్‌ను ఆశ్రయించింది. నిందితులపై కేసు పెట్టాలని షీటీమ్‌ నారాయణగూడ పోలీసులకు సిఫార్సు చేసింది. దీంతో ఐదుగురు యువకులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వీరిని గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు.


   

మరిన్ని వార్తలు