తల్లీ, కుమార్తెతో సహజీవనం.. ఆపై హత్య

2 Feb, 2021 11:38 IST|Sakshi

తంబళ్లపల్లె: తల్లీ, కుమార్తె హత్య కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి వివరాల మేరకు.. తంబళ్లపల్లె మండలంలోని గంగిరెడ్డిపల్లె పంచాయతీ ఏటిగడ్డ తాండాకు చెందిన గంగులమ్మ(65) కుమార్తె సరళ (40)తో నిందితుడు మౌలాలి సహజీవనం చేసేవాడు. ముగ్గురు పిల్లలతో వారి పొలంలోని షెడ్డులో నివసించేవారు. సరళపై అనుమానం పెంచుకున్న మౌలాలి ఆమెను గత అక్టోబర్‌ 29న ఆమెను హతమార్చాడు. మృతదేహాన్ని పెద్దేరు ప్రాజెక్టులో వేసి పైకి తేలకుండా రాళ్లు కట్టాడు. కూతురు మూడు రోజులుగా కనిపించపోవడంతో గంగులమ్మ మౌలాలిని నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించడంతో ఆమె నిద్రిస్తున్న సమయంలో చీరతో హత్య చేశాడు.

మృతదేహాన్ని సమీపంలోని గంగచెరువులో వేసి పైకి తేలకుండా చీరను కంపచెట్లకు కట్టేశాడు. మరుసటి రోజు పిల్లలు వారి అమ్మ, అవ్వ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించడంతో వారికి కరోనా సోకిందని 15 రోజుల పాటు ఇంటికి రారని చెప్పాడు. ఇక్కడ ఉంటే విషయం బయటపడుందని భావించి పిల్లలను కర్ణాటకలోని గౌనుపల్లెలో దాచాడు. అప్పుడప్పుడు ఏటిగడ్డ తాండాకు వచ్చి మృతదేహాలు తేలాయో లేదో చూసి వెళ్లేవాడు. ఈ క్రమంలో సరళ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో ఆమె బంధువుల ధనమ్మ ఏటిగడ్డ తాండాకు వచ్చింది.

అక్కడ ఎవరూ లేకపోవడంతో స్థానికులను విచారించింది. ఫలితం లేకపోవడంతో తంబళ్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ములకల చెరువు సీఐ సుకుమార్, ఎస్‌ఐ సహదేవి దర్యాప్తు చేపట్టారు. మౌలాలిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో మృతదేహాలు కుళ్లిపోయి, బట్టలు, ఎముకల గూళ్లు బయటపడినట్లు తెలిపారు. పిల్లలు ముగ్గురు మైనర్లు కావడంతో బంధువులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు