ఇంట్లో గొయ్యి... అమ్మాయి అదృశ్యం!

20 Dec, 2020 04:45 IST|Sakshi
ఇంట్లో తీసిన 30 అడుగుల గొయ్యి , అదృశ్యమైన రాజశ్రీ

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు! 

అదృశ్యమైన అదే ఇంటిబాలిక 

నరబలిపై అనుమానాలు

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఘటన 

ఎర్రుపాలెం: ఒకవైపు గుప్తనిధుల కోసం ఇంట్లో తవ్వకాలు.. మరోవైపు ఆ ఇంటికే చెందిన బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో చోటుచేసుకుంది. రేమిడిచర్లకి చెందిన వెల్లంకి వెంకట్రావు,రాణి దంపతుల కుమార్తె రాజశ్రీ (16) వరంగల్‌లో నివసిస్తున్న తన బాబా యి వెల్లంకి నాగేశ్వరరావు వద్ద ఉంటోంది.  ఆ ఊర్లోనే నివసిస్తున్న గద్దె నర్సింహారావు(నాగేశ్వరరావు మామ) ఇంట్లో లంకె బిందెలున్నా యని క్షుద్రపూజారులు చెప్పడంతో ఇంట్లో సొరంగంలా పెద్దగొయ్యి తీశారు. ఓ బాలికను నరబలి ఇస్తే ఫలితం ఉంటుందని పూజారులు చెప్పడంతో రాజశ్రీతోనే క్షుద్రపూజలు చేయిస్తున్నారని, ఈ విషయం బాలిక తల్లిదండ్రులకూ తెలుసనే ప్రచారం జరుగుతోంది.

రాజశ్రీ తల్లిదండ్రులు ఈ నెల 17న గుంటూరు జిల్లా పెద్ద కాకానిలోని గుడికి వెళ్లారు. రాజశ్రీకి జ్వరం వస్తోందని ఆమెను ఇంటి వద్దే ఉంచారు. వారు తిరిగి వచ్చేసరికి బాలిక అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లి ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను పైచదువుల నిమిత్తం ఇల్లు విడిచి వెళ్తున్నానని బాలిక ఇంగ్లిష్‌లో రాసిన లేఖ ఆమె ఇంట్లో పోలీసులకు దొరికింది. విషయం తన స్నేహితురాలు శరణ్యకు తెలుసని, చదువు పూర్తయిన తర్వాత తిరిగి వస్తానని అందులో పేర్కొంది. ఈ లేఖ రాజశ్రీనే రాసిందా, లేక బలవంతంగా రాయించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శరణ్యను విచారించగా, మహారాష్ట్రలోని అంబాని ఆశ్రమానికి వెళ్తానని రాజశ్రీ చెప్పినట్లు వివరించింది. రాజశ్రీ మొబైల్‌ను లొకేషన్‌ ట్రేసింగ్‌ చేస్తున్నారు. రాజశ్రీని నర బలి ఇచ్చారా లేక తనే ఇంటి నుంచి వెళ్లిపోయిందా.. మాంత్రికులు వేరే ప్రాంతాలకు తమ వెంట తీసుకెళ్లారా..అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు