తండ్రిని కొట్టి చంపిన తనయుడు

28 Feb, 2021 09:26 IST|Sakshi
పెద్ద రాజన్న (ఫైల్‌)

డబ్బుల విషయంలో గొడవ  

సోదరుడిపైనా హత్యాయత్నం

సోన్‌ (నిర్మల్‌): నడిరోడ్డుపై తండ్రిని బండరాయితో కొట్టి చంపాడో కొడుకు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం కూచన్‌పల్లిలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగని పెద్ద రాజన్న, లింగవ్వ దంపతుల రెండో కుమారుడు రవి వారం క్రితం దుబాయ్‌ నుంచి వచ్చాడు. అప్పటి నుంచి తాను పంపిన డబ్బుల విషయమై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు.

శుక్రవారం సాయంత్రం సోదరుడు రాజు ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు రవిని పోలీసులు స్టేషన్‌కు తరలించి.. అర్ధరాత్రి తిరిగి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని బయటకు లాక్కొచ్చి నడిరోడ్డుపై బండరాయితో కొట్టి చంపాడు. మృతదేహాన్ని తరలించే క్రమంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, సోదరుడిపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని రాత్రి వేళ పోలీస్‌స్టేషన్‌ నుంచి ఎందుకు పంపిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారిని డీఎస్పీ శాంతింపజేశారు.  

సైకోగా మారిన రవి 
రవి సైకో మారాడని గ్రామస్తులు పేర్కొన్నారు. వేధింపులు భరించలేక నాలుగేళ్ల క్రితం భార్య విడాకులు తీసుకుంది. మూడేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లిన రవి.. అక్కడా సహచరులతో గొడవ పడేవాడని తెలిసింది. వారి ఫిర్యాదుతో రవిని వారం క్రితం కంపెనీ ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరుడితో గొడవ పడుతున్నాడు. మూడు రోజుల క్రితం తల్లి లింగవ్వపై కొడవలితో దాడి చేయగా.. చేతికి గాయమైంది. 

మరిన్ని వార్తలు