తుపాకీ మిస్‌ఫైర్‌.. ఆర్‌ఎస్‌ఐ మృతి 

17 Sep, 2020 06:39 IST|Sakshi
సాయికుమార్‌ (ఫైల్‌)

చర్ల: తుపాకీ మిస్‌ఫైర్‌ అయి రిజర్వ్‌డ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా బుధవారం చోటుచేసుకుంది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలో తెల్లవారుజామున ఆర్‌ఎస్‌ఐ ఆదిత్య సాయికుమార్‌ (25) చేతిలో ఉన్న ఏకే 47 తుపాకీ పేలి బుల్లెట్లు తొడలోకి దూసుకుపోయాయి. సహచర జవాన్లు సాయికుమార్‌ను తిప్పాపురం తరలించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రవీకరించారు. మృతదేహానికి భద్రాచలం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, అతడి స్వస్థలమైన హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌కు తరలించారు. మరో రెండు నెలల్లో గ్రేహౌండ్స్‌ ఆర్‌ఐగా పదోన్నతి పొందాల్సిన సాయికుమార్‌ మృతి పట్లకుటుంబ సభ్యులు, సహచర జవాన్లు ఆవేదన చెందుతున్నారు.   

మరిన్ని వార్తలు