వాట్సాప్‌లో టెన్త్‌ పరీక్ష పేపర్‌.. ముగ్గురు అరెస్ట్‌

20 Feb, 2021 12:23 IST|Sakshi

పట్నా: బిహార్‌ రాష్ట్రంలో పదో తరగతి సోషల్‌ సైన్స్‌ పరీక్ష ప్రశ్న పత్రాన్ని లీకు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిహార్‌​ స్కూల్‌ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్‌ఈబీ) పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తోంది. బీఎస్‌ఈబీ నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షల్లో భాగంగా శుక్రవారం రోజు సోషల్‌ సైన్స్‌ పరీక్షకు 8.46 లక్షలు మంది విద్యార్థులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో పరీక్ష పేపర్‌ లీకు అయినట్లు తెలియడంతో బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఝాఝా ఎస్‌బీఐ బ్రాంచ్‌కు చెందిన వికాస్‌ కుమార్‌, మరో ఇద్దరు బ్యాంక్‌ సిబ్బంది పరీక్ష పేపర్‌ను లీక్‌ చేశారు.

ప్రధాన నిందితుడైన వికాశ్‌ కుమార్‌ బంధువులతో ఒకరు ఈ పరీక్ష రాయనుండగా.. పరీక్ష పేపర్‌ను లీకు చేసి వాట్సాప్‌ ద్వారా ప్రశ్న పత్రాన్ని పంపించాడు. బోర్డు ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రశ్న పత్రం లీకు అయినట్లు తెలియడంతో బోర్డు పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్షను మార్చి నెల‌ 8న తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. పోలీసులు దర్యాపు పూర్తి చేశారని, ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా విడిచిపెట్టేది లేదని బీఎస్‌ఈబీ చైర్మన్‌ అనంద్‌ కిశోర్‌ తెలిపారు. చట్టపరంగా శిక్ష పడేలా చూస్తామని వెల్లడించారు.
చదవండి: హత్యను గుండెపోటుగా చిత్రీకరించి ఖననం
చదవండి: దారుణం: మైనర్‌ బాలికలకు విషం ఇచ్చి

మరిన్ని వార్తలు