స్విగ్గీ ఆర్డర్‌..ఇల్లు దోచేశారు!

3 Mar, 2021 13:02 IST|Sakshi

లక్నో: ప్రస్తుతం నడుస్తోంది ఆన్‌లైన్‌ యుగం. ఇల్లు దాటకుండా.. కాలు కదపకుండా నచ్చిన వస్తువులను, ఆహారాన్ని మనం ఉన్న చోటకే తెప్పించుకోగలుతున్నాం. ఇందుకు గాను ఆయా సంస్థలు ప్రత్యేకంగా డెలివరీ బాయ్‌లను నియమించుకుంటారు. వీరు మన ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసే వాటిని మనం ఉన్న చోటకు తీసుకొచ్చి అందజేస్తారు. అయితే యూపీకి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్స్‌ మాత్రం కాస్త డిఫరెంటు. వీరు కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన వస్తువులను ఇంటికి తీసుకురావడంతో పాటు ఆ ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువుల మీద కన్నేస్తారు. ఇంటి పరిసరాలను.. అందులో ఉన్న వస్తువులను స్కాన్‌ చేసుకుని వెళ్లి.. తీరిగ్గా రాత్రికి వచ్చి వాటిని దొంగతనం చేస్తారు. 

తాజాగా నోయిడాలో ఇలా దొంగతనం చేసి పోలీసులకు చిక్కారు. ఆ వివరాలు.. నోయిడా స్విగ్గీ సంస్థ ఫుడ్‌ డెలివరీ కోసం కాంట్రాక్ట్‌ బేస్‌లో బులంద్‌షహర్‌ జిల్లాకు చెందిన మహమ్మద్‌ కఫిల్‌, రవి శంకర్ నియమించింది. ఈ క్రమంలో వీరు రెండు రోజుల క్రితం నోయిడాలోని ఒక ఇంట్లో రాత్రిపూట అక్రమంగా ప్రవేశించి, తాళం పగలగొట్టి, అ‍క్కడున్న 32 ఇంచ్‌ల ఎల్‌ఈడీ టీవీ, 2 ట్రాక్‌సూట్‌లు, 2 వ్రిస్ట్‌ వాచ్‌లు, కొంత సొమ్మును దొంగిలించారు. కస్టమర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సిగ్గీ డెలివరీ బాయ్‌ల నిర్వాకం వెలుగు చూసుంది.

నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని.. వీరి వద్ద నుంచి  దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకొన్నారు. వీరిపై పలు సెక్షన్‌ల కింద కేసులను నమోదు చేశామని నోయిడా అడిషనల్‌ డీసీపీ రన్వీజయ్‌సింగ్‌ తెలిపారు. అయితే నిందితులిద్దరిని ఇప్పటికే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు స్విగ్గీ సంస్థ ప్రకటించింది.  తాము దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని స్విగ్గీ సంస్థ  తెలిపింది. కాగా, దొంగిలించిన వస్తువులను కొన్న మూడో వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిని కూడా తొందరలొనే పట్టుకుంటామని నోయిడా పోలీసులు‌ తెలిపారు. 

చదవండి: ‘కుక్కలా ఉన్నావ్‌’ : బిగ్‌బాస్‌ ఫేమ్‌పై దారుణ ట్రోలింగ్

మరిన్ని వార్తలు