-

కసాయి తల్లి నిర్వాకం.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కూతురిపై అత్యాచారం

28 Nov, 2023 09:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువ‌నంత‌పురం: అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదు. త్యాగానికి ప్రతిరూపం అమ్మ. పిల్లలపై కన్నతల్లికి ఉన్న ప్రేమ, మమకారం వర్ణించలేనిది. అలాంటి పేగు బంధానికి మాయని మచ్చ తెచ్చింది ఓ మాతృమూర్తి. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించింది కసాయి తల్లి. సభ్యసమాజం సిగ్గుపడే ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్నతల్లి బంధానికే అర్ధాన్ని మార్చివేస్తూ మహిళ చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో సదరు తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌ను వ‌దిలేసి ప్రియుడు శిశుపాల‌న్‌తో సహజీవనం చేస్తుంది. ఆ సమయంలో మహిళ ఏడేళ్ల కూతురు తన వద్దే ఉంటుంది. ఈ క్రమంలో బాలికనుని శిశుపాల‌న్ అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నిసార్లు స్వయంగా తల్లే తన కూతురిని అతని వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి ప్రోత్సహించింది. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబ‌ర్ మ‌ధ్య కాలంలో ఈలైంగిక దాడి జ‌రిగింది.

అయితే బాధితురాలి పదకొండేళ్ల సోదరి ఇంటికి వచ్చినప్పుడు.. తనపై జరుగుతున్న వేధింపుల విషయాన్ని ఆమెకు వివరించింది. అంతేగాక పెద్ద అమ్మాయిని కూడా శిశుపాలను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల అక్క చిన్నారితో కలిసి ఇంట్లో నుంచి తప్పించుకొని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వారితో చెప్పుకుంది.

ఆమె పోలీసులను ఆశ్రయించగా.. నిందితులపై కేసు నమోదు చేసి తల్లితోపాటు సహజీవన భాగస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు శిశుపాలన్‌ ఆత్మహత్య చేసుకోగా.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు. ఆమెకు ఆరునెలల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. తిరువనంతపురం ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఆ మహిళకు రూ. 20 వేలు జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం పిల్లలు బాలల సంరక్షణ గృహంలో నివసిస్తున్నారు.
చదవండి: కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 28వ ఘటన

మరిన్ని వార్తలు