వైభవంగా 'జక్కంపూడి వారి పెళ్లి సందడి..' ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం!

27 Oct, 2023 12:52 IST|Sakshi
వివాహ రిసెప్షన్‌లో జక్కంపూడి కుటుంబంతో ముచ్చటిస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఉభయ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన అభిమాన గణం!

విందు, వినోదాలతో అబ్బుర పరిచేలా ఏర్పాట్లు..

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కేరళ నృత్యాలు

సాక్షి, తూర్పుగోదావరి: స్థానిక శాసనసభ్యుడు, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా సోదరుడు, వైఎస్సార్‌ సీపీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం రీజినల్‌ కోఆర్డినేటర్‌ జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌ దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావుకు ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అభిమానమంతా ఉవ్వెత్తున ఎగసివచ్చిందా అన్నట్టుగా అభిమాన గణం భారీఎత్తున తరలివచ్చి, ఆయన ద్వితీయ కుమారుడైన గణేష్‌ దంపతులను ఆశీర్వదించారు.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా దివాన్‌చెరువుకు హెలికాప్టర్‌లో వచ్చి, నూతన వధూవరులైన జక్కంపూడి గణేష్‌, సుకీర్తిలను ఆశీర్వదించి, కొద్దిసేపు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఈ సమయంలో కొంతమంది సీఎంతో సెల్ఫీలకు రిక్వెస్టు చేయడంతో అందుకు ఆయన చిరునవ్వుతో వారికి అవకాశం ఇచ్చారు. కుటుంబ సభ్యులే కాకుండా బంధువర్గంలోని వారు, అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.

సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో..
ఆహ్వానితులలో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలుగకుండా సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో సినిమా సెట్టింగ్‌లను తలపించేలా చేసిన ఏర్పాట్లు అందరినీ అబ్బురపరిచాయి. వివాహ రిసెప్షన్‌ వేదికపై యశస్వి కొండేపూడి మ్యూజిక్‌ బ్యాండ్‌ లైవ్‌తోపాటు సింగర్‌ శిల్ప, యాంకర్‌ దీప్తి నల్లమోతు, మిమిక్రీ రాజు, గోవింద్‌ డ్యాన్స్‌ టీమ్‌ లైవ్‌ ప్రోగ్రామ్స్‌ అలరించాయి.

పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన జెయింట్‌ వీల్‌, రంగుల రాట్నం, ‘పెట్టా తులాల్‌’ కేరళ నృత్యం, ప్రకృతి ఒడిలోకి వచ్చామా అనే రీతిలో ఆసక్తి ఉన్నవారు ఫొటో షూట్‌లు తీసుకునేలా వేసిన సెట్టింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక భోజన సదుపాయాల గురించి ప్రస్తావిస్తే .. ‘ఆహా .. ఏమి రుచి, తినరా మైమరిచి..’ అనేవిధంగా 24 రకాల వంటకాలతో ఆహార ప్రియుల మదిని దోచారని చెప్పవచ్చు.

ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం..
జక్కంపూడి గణేష్‌ వివాహ రిసెప్షన్‌కి గురువారం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తాడేపల్లి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో దివాన్‌చెరువులోని డీబీవీ రాజు లేఅవుట్‌లోని హెలిపాడ్‌పై దిగిన ఆయనకు ఆహ్వాన కర్త, స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన తల్లి జక్కంపూడి విజయలక్ష్మితో పాటు మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, తానేటి వనిత, ఆర్‌కే రోజా, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్‌నాథ్‌, పినిపే విశ్వరూప్‌, కారుమూరి నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, రాజంపేట ఎంపీ పీవీ మిధున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఆహ్వానం పలికారు.

కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్‌రామ్‌, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, అనంతబాబు, వంక రవీంద్రనాఽథ్‌, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, తలారి వెంకట్రావు, కొండేటి చిట్టిబాబు, జె.శ్రీనివాస్‌నాయుడు, డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, రుడా మాజీ చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు, రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్‌ గూడూరి శ్రీనివాస్‌, రూరల్‌ కో ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత, పలువురు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. సినీ ప్రముఖులు రామ్‌గోపాల్‌వర్మ, సుమన్‌, హీరో విశ్వక్‌సేన్‌లు గణేష్‌, సుకీర్తిలకు ఆశీస్సులు అందజేశారు.

మరిన్ని వార్తలు