జంగారెడ్డిగూడెం: పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై మోటార్సైకిల్ను కారు ఢీకొన్న ఘటనలో ఓ కాంట్రాక్టర్ మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ముత్రాసు కాలనీ నుంచి కాంట్రాక్టర్ కమ్ బిల్డర్ కేతిరెడ్డి అప్పలనాయుడు (47) మోటార్ సైకిల్పై జాతీయ ప్రధాన రహదారిపైకి వస్తున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న కారు అప్పలనాయుడు మోటార్సైకిల్ను ఢీకొట్టి ఆగకుండా సమీపంలో ఉన్న బడ్డీ కొట్టులోకి దూసుకువెళ్లి పల్టీ కొట్టింది. దీంతో బడ్డీ కొట్టు ధ్వంసమై అందులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో గాయపడిన అప్పలనాయుడు, తమ్మిశెట్టి రాజు, కట్టా లక్ష్మీనారాయణ, చిన్నం దుర్గారావు, బడ్డీ కొట్టు యజమాని పోలిన ప్రసాద్లను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పలనాయుడిని పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. కట్టా లక్ష్మీనారాయణకు నడుంపై గాయం కాగా, చిన్నం దుర్గారావును ప్రాథమిక చికిత్స చేసి రాజమండ్రి తరలించారు. కారు యజమాని సున్నం వీరవెంకట సత్యనారాయణ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు. ఇటీవలే కొత్త కారు కొన్నారు. హైవేలో ఉన్న మారుతీ గ్యారేజ్లో సర్వీసింగ్ కోసం ఇచ్చారు. సర్వీసింగ్ అనంతరం సర్వీస్ మేనేజర్ షేక్ జహంగీర్ బాషా కారును ట్రైల్ వేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో కారు యజమాని సత్యనారాయణ కూడా కారులో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ఉన్న సత్యనారాయణ, జహంగీర్ బాషా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా మృతి చెందిన అప్పలనాయుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికి వివాహాలు అయ్యాయి. అప్పలనాయుడు మృతదేహానికి పోస్టుమార్టంకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీకొని ఆగకుండా
దుకాణంలోకి దూసుకెళ్లిన కారు
మరో నలుగురికి గాయాలు