మా కోరిక వికేంద్రీకరణే!

3 Feb, 2022 12:17 IST|Sakshi

1953 నాటి ఆంధ్ర రాష్ట్రమే, 2014లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం! 1953లో కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడినాయి. శ్రీబాగ్‌ ఒప్పందంలోని ఒక్క అంశం, ఆ రకంగానైనా ఆనాడు ఆచరణలోకి వచ్చింది. దానిని ఇప్పుడు కొనసాగించమనేదే మా గట్టి డిమాండ్‌. మూడు రాజధానులు కాదు, మూడు వికేంద్రీకరణలు మాత్రమే! కర్నూలులో పరిపాలనా రాజధాని, అసెంబ్లీ, గుంటూరులో ఓ హైకోర్టు, విశాఖలో శీతకాలపు అసెంబ్లీ సమావేశాలు ఉండాలనేది మా అభిప్రాయం. విశాఖపట్టణం ఆర్థిక రాజధానిగా వెలుగొందుతుందని మా విశ్వాసం. (చదవండి: ‘ఒకే దేశం, ఒకే ఎలక్షన్‌’లో మర్మం?)

అంతే కాకుండా... పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలి. తుంగభద్ర సమాంతర కాలువ నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. నదుల అనుసంధానంలో భాగంగా కేంద్ర ప్రణాళికలోని ‘ఆల్మట్టి నుంచి బుక్కపట్నం లింక్‌ కెనాల్‌ గురించి కేంద్రంతో, కర్నాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. హంద్రీ–నీవా  కాలువ సామర్థ్యాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచాలి. గాలేరు–నగరి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!)

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అడ్డుకుని, నిల్వ ఉన్న దుంగలను వేలం వేసి ఆ డబ్బును రాయలసీమ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కడపజిల్లాలో ఉక్కు కర్మాగారం, మల్లవరంలో బీహెచ్‌ ఈఎల్‌ ఏర్పాటు, పులరిన్‌ ఖనిజం వెలికితీత, ఆ ఖనిజాధారిత పరిశ్రమల ఏర్పాటు తదితరాలు మా తక్షణ డిమాండ్లు. శ్రీబాగ్‌ ఒడంబడికను అనుసరించే నీళ్ల వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ జరగాలని మేం కోరు కుంటున్నాం. రాజీలేని మా వైఖరి, ఏ అపార్థాలకూ తోవచూపరాదని విశ్వసిస్తూ...

– రాయల సీమ కవులు, రచయితలు
(కేతు విశ్వనాథరెడ్డి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, బండి నారాయణ స్వామి, భూమన్, శాంతినారాయణ, వేంపల్లె షరీఫ్, రాసాని వెంకట్రామయ్య, మధురాంతకం నరేంద్ర, తదితరులు)  

మరిన్ని వార్తలు