స్మార్ట్‌సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయండి

1 Apr, 2023 01:20 IST|Sakshi
స్మార్ట్‌సిటీ పనులపై సమీక్షిస్తున్న మేయర్‌, కలెక్టర్‌

వరంగల్‌ అర్బన్‌ : స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్‌ గుండు సుధారాణి ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్‌ హాల్‌లో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులపై బల్దియా, ఇరిగేషన్‌, విద్యుత్‌శాఖ,‘కుడా’అధికారులతో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌, వరంగల్‌ కలెక్టర్‌ ప్రావీణ్యతో కలిసి మేయర్‌ సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, వడ్డెపల్లి బండ్‌ అభివృద్ధి పనులు, భద్రకాళి బండ్‌ జోన్‌–డీ పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. నాలాలపై కల్వర్టుల ఏర్పాటు, రోడ్ల విస్తరణ పనుల్లో ఏమైనా అవరోధాలు ఏర్పడితే పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పరిష్కరించాలన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్‌ లేకుండా బిల్లులు చెల్లిస్తున్నామన్నారు. లైబ్రరీల నవీకరణలో భాగంగా ప్రస్తుతం పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ప్రాంతీయ, సెంట్రల్‌ లైబ్రరీల్లో ఈ–బుక్స్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లతో అందుబాటులోకి వెంటనే తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమీక్షలో బల్దియా ఎస్‌ఈ ప్రవీణ్‌ చంద్ర, స్మార్ట్‌ సిటీ పీఎంపీ ఆనంద్‌ ఓలేటి, సిటీ ప్లానర్‌ వెంకన్న, సీహెచ్‌ఓ శ్రీనివాసరావు, ఈఈలు రాజయ్య, సంజయ్‌ కుమార్‌, కుడా ఈఈ భీంరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మేయర్‌ గుండు సుధారాణి

ఇన్‌చార్జ్‌ కమిషనర్‌,

కలెక్టర్‌ ప్రావీణ్యతో కలిసి సమీక్ష

మరిన్ని వార్తలు