హన్మకొండ అర్బన్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 35 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వాటిని సోమవారం పరిశీలించిన అధికారులు వాటిలో 20 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఆమోదించారు. మరో 15 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాల్ని వివిధ కారణాలతో తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్.రమేశ్ తెలిపారు. కాగా.. నియోజకవర్గంలో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ పత్రాలు ఎవరివీ తిరస్కరణకు గురికాలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ నామినేషన్పై బీజేపీ అభ్యర్థి రావు పద్మ భర్త రావు అమరేందర్రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నిబంధనల మేరకు వినయ్భాస్కర్ అభ్యర్థిత్వాన్ని ఆర్ఓ ఆమోదించారు. ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా.. ప్రస్తుతం 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉపసంహరణ అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలే అవకాశం ఉంది.
ఏవి తిరస్కరించారంటే..
పెండం రాఘవరావు (ఏఐఎఫ్బీ), సాయిని రవీందర్ (బీసీవైపీ), ఆకుతోట సౌమ్యశ్రీ (వీఆర్పీ), నాయిని శ్రీ గోదారెడ్డి (కాంగ్రెస్), దామెర సుదర్శన్ (సీపీఐ, మార్కిస్ట్–లెనినిస్ట్), బోనగాని యాదగిరి (ఏడీఆర్పీ), సయ్యద్ నయీం (వీబీపీ), ఇండిపెండెంట్లు గోలెన నరేందర్, బంక రాజు, గుర్రం శాంతమ్మ, ఫారుఖ్ అహ్మద్ హసన్ మహ్మద్, మురతోటి కల్పన, అశోక్, సయ్యద్ ఖాజా నయీముద్దీన్, బా నోతు విద్యాసాగర్ నామినేషన్లు తిరస్కరించారు.
‘తూర్పు’లో 6 నామినేషన్లు..
వరంగల్ అర్బన్: వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పక్రియ సోమవారం సాయంత్రం వరకు కొనసాగింది. గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ బాషా, ఏఆర్ఓలు, వివిధ పార్టీల, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 37 మంది 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లను నిశితంగా పరిశీలించిన ఆర్ఓ, ఇతర అధికారులు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.
‘పశ్చిమ’లో 20 ఆమోదం..
15 తిరస్కరణ
15 వరకు ఉపసంహరణ గడువు