2వేల ఏళ్ల నాటి మమ్మీ: నోటిలో బంగారు నాలుక

3 Feb, 2021 14:37 IST|Sakshi

కైరో: ఈజిప్టులో జరుపుతున్న పురావస్తు తవ్వకాల్లో 2వేల ఏళ్ల నాటి మమ్మి బయటపడింది. ఈజిప్టులో మమ్మీలు బయటపడటం సహజమే కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. కానీ ఈసారి బయటపడిన మమ్మీ బంగారు నాలుకతో ఉంది. అది చూసి అధికారులు అవాక్కయ్యారు. దీంతో మమ్మీ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. వివరాలు.. ఈజిప్టులోని తపోరిస్‌ మగ్నా ప్రాంతంలో పురావస్తు పర్యాటక శాఖ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ మమ్మీ బయటపడింది.

అయితే దాని నోటిలో బంగారు నాలుక ఉండటంతో శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా ఇది 2వేల ఏళ్ల నాటిదిగా తేలింది. అయితే ఈ వ్యక్తి చనిపోయినప్పుడు అతడిని మమ్మీగా మార్చేందుకు ఈ బంగారు నాలుకను నోటీ మీద ఉంచి ఉంటారని, కాలక్రమేణా అది నోట్లోకి జారి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ‘ఈజిప్టులో మరణం తర్వాత వారు ఖచ్చితంగా మళ్లీ పుడతారని అక్కడి వారి నమ్మకం. బహుశా ఆ నమ్మకంతోనే మరో జన్మలో కూడా ఈ వ్యక్తి మాట్లాడాలనే ఉద్దేశంతో బంగారు నాలుకను పెట్టడం అక్కడి సంప్రాదాయమని’ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు