కఠ్మాండు/న్యూఢిల్లీ: నేపాల్ ప్రజలను మరోసారి భూకంపం భయపెట్టింది. శుక్రవారం భూకంపం సంభవించిన పశ్చిమ నేపాల్లోని జజర్కోట్ పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం 4.31 గంటల సమయంలో భూమి కంపించింది. ఆ తర్వాత 4.40 సమయంలో 4.5 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలు నమోదయ్యాయి.
తాజా భూకంప కేంద్రం జజర్కోట్ జిల్లాలోని రమిదండాలో ఉందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాజధాని కఠ్మాండులోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకు న్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. తాజా భూకంపంతో వాటిల్లిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో గత శుక్రవారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 157కు చేరుకుంది.