తల్లీకొడుకులను భయపెట్టి వారి ఆహారం తిసేసిన ఎలుగు

28 Sep, 2023 08:25 IST|Sakshi

మెక్సికోలోని చిపింక్యూ ఎకోలాజికల్ పార్క్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పిక్నిక్ పార్టీలోకి చొరబడిన ఒక ఎలుగుబంటి అక్కడి ఆహార పదార్థాలన్నింటినీ ఆనందంగా ఆరగించింది. ఆ ఎలుగుబంటి ఎటువంటి బెరుకు లేకుండా, టేబుల్‌పైకి ఎక్కి అక్కడి ఆహారాలను ఆనందంగా ఆస్వాదించింది. 

పిక్నిక్‌ చేసుకునేందుకు వచ్చిన తల్లీకొడుకులు ఆ సీన్‌ చూసి భయంతో నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. ఎలుగుబంటి  నుండి తన కుమారుడిని రక్షించడానికి ఆ మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వైరల్ వీడియో టిక్‌టాక్‌లో 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ దక్కించుకుంది. అటవీ జంతువుల చేష్టలను చూసేందుకు ఇష్టడేవారు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు. 

బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం చిపింక్ ఎకోలాజికల్ పార్క్ నిర్వాహకులు మాంటెర్రీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెరుగుతున్న ఎలుగుబంటి దాడుల గురించి ఇటీవల హెచ్చరికను జారీ చేశారు. పార్క్ సందర్శకుల కోసం పలు సూచనలు చేశారు. ఫొటోలు, వీడియోల కోసం ఈ జంతువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించారు. పార్క్‌లో ఇలాంటి దాడి జరగడం ఇదేమీ తొలిసారి కాదు. 2020లో ఒక ఎలుగుబంటి సందర్శకునిపై దాడి చేసింది.  అప్పుడు కూడా ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: ‘జో నెహ్రూ’ ఎవరు? ఇందిర, సోనియా, ప్రియాంకలకు ఏమి బహూకరించారు?
 

మరిన్ని వార్తలు