Trichotillomania: ఈ చిన్నారి కష్టం తెలిస్తే కడుపు తరుక్కుపోతుంది

29 Sep, 2021 19:51 IST|Sakshi
      ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ట్రైకోటిల్లోమానియా బారిన పడిన చిన్నారి

ఇంగ్లండ్‌, బ్రిస్టల్‌లో చోటు చేసుకున్న ఘటన

ఇంగ్లండ్‌/ బ్రిస్టల్‌: కరోనా మహమ్మారి ఏ నిమిషాన ఈ ప్రపంచంలో అడుగుపెట్టిందో తెలియదు కానీ... మనుషులెవరిని ప్రశాంతంగా బతకనీయడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఏదో ఒక రకంగా బాధిస్తోంది. ప్రతి ఒక్కరి మీద ప్రభావాన్ని చూపుతోంది. మరీ ముఖ్యంగా కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ చాలా మందిపై ఆర్థిక, మానసిక ప్రభావం చూపింది.

పాఠశాలలు మూసివేయడం.. బయటకు వెళ్లే అవకాశం లేకుండా ఇంటికే పరిమితం కావడంతో పిల్లలు కూడా డిప్రెషన్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఒత్తిడి భరించలేక ఎనిమిదేళ్ల చిన్నారి చేసుకున్న కొత్త అలవాటు ప్రస్తుతం తన జీవితాన్ని నరకప్రాయం చేసింది. స్నేహితులు, చుట్టుపక్కల వారు గేలి చేస్తూ ఏడిపిస్తున్నారు. ఆ చిన్నారి వ్యధ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు..
(చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!!)


                              ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా

ఇంగ్లండ్‌, బ్రిస్టల్‌ నగరానికి చెందిన అమెలియా అనే ఎనిమిదేళ్ల చిన్నారి.. మొదటిసారి 2020లో విధించిన లాక్‌డౌన్‌ కాలంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యింది. దాన్ని తట్టుకోలేక కనురెప్పలను లాగి పడేయ్యడం ప్రారంభించింది. ఆ అలవాటు అలానే కొనసాగి.. చివరకు తల వెంట్రుకలను కూడా అలానే లాగసాగింది. కొన్ని రోజుల్లోనే బాలిక కనురెప్పలు, తలలో ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు పూర్తిగా మాయమయ్యాయి.

అమెలియా పరిస్థితి చూసిన ఆమె తల్లి.. స్నేహితులను కలవకుండా ఉండటం, పాఠశాలకు వెళ్లకపోవడం వల్లే.. తన కుమార్తె ఇలా అయ్యిందని భావించింది. ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆన్‌లైన్‌లో డాక్టర్‌ని సంప్రదించి కుమార్తె పరిస్థితిని వివరించింది అమెలియా తల్లి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు తను ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతుందని వెల్లడించారు.


                    ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా
(చదవండి: వైరల్‌: బుజ్జగించడానికి మీ పిల్లలకు ఇవి ఇస్తున్నారా..)

కొద్ది కాలం తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేశారు.. పాఠశాలలు తెరిచారు. కానీ అమెలియా మాత్రం తన అలవాటును మానుకోలేకపోయింది. వైద్యుల ప్రకారం జనాభాలో ప్రతి 50 మందిలో ఒకరు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఒత్తిడి, ఆందోళన, ఏదైన బాధ.

ప్రస్తుతం అమెలియా తల మీద.. అది కూడా వెనకభాగంలో మాత్రమే కొన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయి. విగ్గు, స్కార్ఫ్‌ లేకుండా అమెలియా బయటకు వెళ్లడం లేదని ఆమె తల్లి తెలిపింది. ఈ వ్యాధి కారణంగా తన కుమార్తె ఎన్నో అవమానాలు ఎదుర్కొందని.. తోటి పిల్లలు తనను ఏడిపించారని.. ఫలితంగా అమెలియా మరింత డిప్రెషన్‌కు గురైందని తెలిపింది.
(చదవండి: అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్‌)


                  ‘ట్రైకోటిల్లోమానియా’ అనే వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమెలియా

అమెలియా తల్లి మాట్లాడుతూ.. ‘‘తను ప్రారంభంలో కనురెప్పలను లాగుతున్నప్పుడు నేను దాని గురించి పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ తన కనురెప్పలు పూర్తిగా పోయాయో అప్పుడు నాకు భయం వేసింది. ఈ అలవాటును మాన్పించాలని ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. అలా పెరుగుతూనే ఉంది. చివరకు తల వెంట్రుకలను లాగడం ప్రారంభించింది. ప్రస్తుతం తన తల వెనకభాగంలో మాత్రమే వెంట్రుకలు ఉన్నాయి. ముందు భాగం అంతా గుండయ్యింది’’ అని వాపోయింది. 

తన కూతురు పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న అమెలియా తల్లి, ఆమెను వారం వారం స్కూల్ థెరపిస్ట్, ప్రైవేట్ హిప్నోథెరపీ సెషన్‌లకు తీసుకెళ్తుంది. ఇందుకు ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని తెలిపింది. అంతేకాక ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ట్రైకోటిల్లోమానియాతో బాధపడుతున్నారని కానీ ఇప్పటికీ దాని గురించి పెద్దగా అవగాహన లేదని.. పరిస్థితికి చాలా తక్కువ మద్దతు ఉందని వాపోయింది.

చదవండి: ఒక్క కరోనా కేసు.. మూడు రోజులు దేశాన్నే మూసేశారు

మరిన్ని వార్తలు