మళ్లీ తగ్గేదేలే..! గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

1 Dec, 2023 11:33 IST|Sakshi

టెల్ అవీవ్: ఇజ్రాయెల్- హమాస్ మధ్య మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. తాత్కాలిక కాల్పుల విరమణ శుక్రవారం ఉదయం ముగియడంతో గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధాన్ని పునప్రారంభించింది. కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందాన్ని ఇటు ఇజ్రాయెల్ గానీ, అటు హమాస్‌ వర్గం ప్రకటించలేదు. దీంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మళ్లీ ప్రారంభమైంది.  

కాల్పుల విరమణ ముగియడానికి కొన్ని గంటల ముందే గాజా నుంచి ప్రయోగించిన రాకెట్‌ను తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. అటు.. హమాస్ అనుబంధ మీడియా కూడా గాజా ఉత్తర ప్రాంతాల్లో పేలుళ్లకు సంబంధించిన శబ్దాలు వస్తున్నట్లు నివేదించింది. 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభమైంది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు మొదట దాడి చేశారు. ఆ తర్వాత ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో గాజాపై విరుచుకుపడింది. ఉత్తర గాజాను ఖాలీ చేయించింది. హమాస్ అంతమే ధ్యేయంగా కాల్పులు జరిపింది. అయితే.. అమెరికా సహా ప్రపంచ దేశాల విన్నపం మేరకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయి.

ఇజ్రాయెల్, హమాస్ ఇరుపక్షాలు బందీలను వదిలిపెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ గురువారం ఉదయం నాటికే నాలుగు రోజుల కాల్పుల విరమణ పూర్తైంది. బందీలంతా విడుదల కాకపోవడంతో కాల్పుల విరమణను మరొక్క రోజు పొడిగించారు. శుక్రవారం ఉదయానికి ఆ గడువు కూడా పూర్తవడంతో మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. 

ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్'

మరిన్ని వార్తలు