గుజరాత్‌ సముద్ర తీరంలో పాక్‌ బోటు పట్టివేత

10 Jan, 2022 08:06 IST|Sakshi
10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్న భారత తీరరక్షణ దళం(ఐసీజీ)

అహ్మదాబాద్‌: గుజరాత్‌ సమీపంలో అరేబియా సముద్రంలోని భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన పడవతోపాటు అందులోని 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు భారత తీరరక్షణ దళం(ఐసీజీ) తెలిపింది. శనివారం అర్ధరాత్రి పెట్రోలింగ్‌ సమయంలో పాక్‌కు చెందిన యాసీన్‌ అనే పడవ భారత ప్రాదేశిక జలాల్లోకి 11 కిలోమీటర్ల దూరం చొచ్చుకురావడాన్ని ఐసీజీ పసిగట్టింది.

చదవండి: సెన్సార్‌ దెబ్బ.. ఏకంగా రూ.40 వేల కోట్ల నష్టం!! ఆగిపోతే ఆగమేమో?

వెంటనే పడవలోని సిబ్బందిని ప్రశ్నించింది. వారు సరైన సమాధానం ఇవ్వకపోగా, పాక్‌ జలాల్లోకి పారిపోయేందుకు ప్రయతి్నంచారు. వెంటనే అప్రమత్తమై ఆ పడవను అడ్డగించి, అదుపులోకి తీసుకున్నట్లు ఐసీజీ వెల్లడించింది. పాక్‌లోని కేతిబందర్‌లో రిజిస్టరై ఉన్న ఆ పడవలోని 2 వేల కిలోల చేపలు, 600 లీటర్ల డీజిల్‌ను సీజ్‌ చేశామని తెలిపింది. ఆ పడవను పోర్‌బందర్‌లో నిలిపి ఉంచి, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు