ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం

24 Oct, 2023 15:37 IST|Sakshi

న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి మహిళకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ కమలా షిరిన్ లఖ్ధీర్‌ను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. లఖ్ధీర్‌కు దాదాపు 30 సంవత్సరాలు విదేశాంగ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కూడా పనిచేశారు.

2017 నుంచి 2021 వరకు మలేషియాలో అమెరికా అంబాసిడర్‌గా పనిచేయడానికి ముందు, ఆమె రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కొనసాగారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తర ఐర్లాండ్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా ఆమె పనిచేశారు.

1991లో ఫారిన్ సర్వీస్‌లో చేరిన లఖ్దీర్‌.. సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీలో మొదట పనిచేశారు. మారిటైమ్ ఆగ్నేయాసియా వ్యవహారాల కార్యాలయానికి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాల బ్యూరోలో తైవాన్ కోఆర్డినేషన్ స్టాఫ్‌కు డిప్యూటీ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన లఖ్ధీర్.. హార్వర్డ్ కళాశాల నుంచి బీఏ, నేషనల్ వార్ కళాశాల నుంచి ఎమ్‌ఎస్‌ పట్టా పొందారు. చైనీస్, ఇండోనేషియాతో సహా పలు భాషలపై ఆమెకు పట్టు ఉంది. 

ఇదీ చదవండి: శ్రీలంక ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. భార‌త్‌తో స‌హా ఏడు దేశాల‌కు ఉచిత వీసాలు

మరిన్ని వార్తలు