ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్‌ ఎలా జరుగుతుంది?

2 Nov, 2023 09:29 IST|Sakshi

ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది ప్రజులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ యుద్ధాన్ని ఆపడం యావత్ ప్రపంచానికి పెను సవాలుగా మారింది. అమెరికా నుంచి బ్రిటన్ వరకు పలు దేశాలు ఇందుకోసం ప్రయత్నించాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్-హమాస్ విషయమై ఒక ప్రతిపాదన వచ్చింది. దీనికి సంబంధించిన ఓటింగ్‌లో భారత్‌ పాల్గొనలేదు. ఇంతకీ ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ)లో ఓటింగ్ ఎలా జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం  సమయంలో మాదిరిగానే భారత్ ఈసారి కూడా ఐక్యరాజ్య సమితిలోని ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఇజ్రాయెల్-హమాస్‌ వివాదంపై రూపొందించిన ఈ ప్రతిపాదనలో వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించడం, గాజాలోని బాధితులకు ఉపశమనం కల్పించడం, కాల్పుల విరమణ, బందీల విడుదల తదితర అంశాలు ఉన్నాయి. జోర్డాన్ ఈ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టింది.

ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఏ దేశమైనా తన ప్రతిపాదనను సమర్పించవచ్చు. దీనిపై ఓటింగ్ జరగాలా వద్దా అనేదానిని యూఎన్‌ఓ చైర్మన్ నిర్ణయిస్తారు. ప్రతిపాదనను ఆమోదించడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతం ప్రపంచంలోని 193 దేశాలు ఐక్యరాజ్యసమితిలో సభ్యులుగా ఉన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ కేసులో తీసుకొచ్చిన తీర్మానానికి 120 ఓట్లు వచ్చాయి. అంటే మెజారిటీ వచ్చింది. ఎటువంటి పరిస్థితులనైనా శాంతియుతంగా పరిష్కరించడం కోసం సిఫార్సులు చేయడం యూఎన్‌జీఏ పని. తీర్మానం ఆమోదం కోసం వచ్చినప్పుడు ఈ సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల స్టాండ్ ఏమిటో తెలుస్తుంది. తరువాత యుద్ధంలో పాల్గొన్న దేశానికి నైతిక సందేశం పంపిస్తారు. యూఎన్‌జీఏ ఏ దేశాన్నీ చట్టబద్ధంగా కట్టడి చేయదు. దీని కోసం యూఎన్‌ఎస్‌సీని రూపొందించారు. 
ఇది కూడా చదవండి: ఏ రాష్ట్రంలో ఎక్కువ పనిగంటలు?

మరిన్ని వార్తలు