Israel-Hamas War: 'నేను బందీగా ఉంటా.. నా భార్యాబిడ్డలను వదలండి' ఓ తండ్రి ఆవేదన

10 Oct, 2023 09:43 IST|Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఎ‍న్నో కన్నీటిగాథలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్ దళాల అదుపులో వందలాది మహిళలు, పిల్లలు బందీలుగా ఉన్నారు. ఇందులో ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు పిల్లలతో ఓ తల్లి కూడా బందీగా చిక్కింది. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న ఆ పిల్లల తండ్రి ఆవేదన కంటతడి పెట్టిస్తోంది. 

డోరోన్ అషెర్ తన ఇద్దరు పిల్లలతో గాజా సరిహద్దులో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్లింది. ఆమె భర్త యూనీ అషెర్ సెంట్రల్ ఇజ్రాయెల్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో హమాస్ ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడ్డారనే విషయాన్ని డోరోనే తన భర్తకు ఫోన్‌లో తెలుపుతుండగానే కాల్ కట్ అయిపోయింది. గూగుల్ అకౌంట్ ద్వారా వారి ఆచూకీని గమనించిన యూనీ అషెర్‌.. తనవారు గాజాలో ఉన్నట్లు గమనించాడు.

తన భార్యా పిల్లలను హమాస్ ఉగ్రవాదులు ఎత్తుకుపోయిన తర్వాత సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో వారిని యూనీ అషెర్ గుర్తించారు. ఆ వీడియోలో కనిపిస్తున్నది తన భార్యా బిడ్డలేనని అధికారులకు తెలిపారు. వ్యాన్‌లో హమాస్ ఉగ్రవాదులు బందించి తీసుకువెళ్తున్నట్లు కనిపించిన ఆ వీడియోను చూసి యూనీ అషెర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలు ఏం తిన్నారో..? ఎలా ఉన్నారో..? అంటూ బోరున విలపిస్తున్నాడు. మహిళలను, పిల్లలను కొట్టకండంటూ హమాస్ ఉగ్రవాదులను కోరుకుంటున్నాడు. 'కావాలంటే నేను వస్తా.. కానీ నా భార్యా బిడ్డలను వదిలేయండి' అని వేడుకుంటున్నాడు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ దళాల మధ్య భీకర పోరు నడుస్తోంది. మూడు రోజులుగా నడుస్తున్న యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్‌ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్‌ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్‌ ప్రకటించింది.    

ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం

మరిన్ని వార్తలు