వీడియో: రెచ్చిపోతున్న ఖలిస్తాన్ మద్దతుదారులు.. ఇండియన్ కాన్సులేట్‌పై విధ్వంసకాండ

20 Mar, 2023 18:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఖలీస్తాన్‌ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ.. విదేశాల్లో భారత సంబంధిత దౌత్యపరమైన కార్యాలయాలపై వరుస దాడులకు తెగబడుతున్నారు. లండన్‌లో భారత హైకమిషన్‌ భవనం వద్ద భారతీయ జెండాను కిందకు లాగి అవమానపరిచే యత్నం మరిచిపోకముందే.. తాజాగా శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్‌ కాన్సులేట్‌పై దాడికి పాల్పడ్డారు.

పంజాబ్‌లో ఖలీస్తాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను.. సినీ ఫక్కీ ఛేజ్‌ తర్వాత పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం అంతర్జాతీయంగా ప్రభావం చూపెడుతోంది. ఖలిస్తాన్‌ మద్దతుదారులు భారత దౌతకార్యాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆదివారం లండన్‌లోని భారతీయ హైకమిషన్‌ భవనం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారతీయ జెండాను కిందకు దించి.. ఖలీస్తానీ జెండాను ఎగరేసే యత్నం చేశారు. అయితే.. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ.. ఆ దేశపు దౌత్యవేత్తలకు వివరణ కోరుతూ సమన్లు సైతం జారీ చేసింది. 

అయితే.. తాజాగా శాన్‌ ఫ్రొన్సిస్కో(యూఎస్‌ స్టేట్‌ కాలిఫోర్నియా)లోని ఇండియన్‌ కాన్సులేట్‌ భవనంపై దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు దాడికి పాల్పడడంతో పాటు అక్కడి గోడలపై ఫ్రీ అమృత్‌పాల్‌(అమృత్‌పాల్‌ను విడుదల చేయాలి) అంటూ రాతలు రాశారు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో పంజాబీ సంగీతం భారీ శబ్ధంతో వినిపిస్తోంది. దాడికి పాల్పడిన దుండగుల్లోనే కొందరు వీడియోలు తీయడం విశేషం ఇక్కడ. ఈ పరిణామంపై అదనపు సమాచారం అందాల్సి ఉంది.

ఇదీ చదవండి: త్రివర్ణ పతాకాన్ని అవమానం నుంచి కాపాడారు!

మరిన్ని వార్తలు