పంజాబ్‌, తమిళనాడు గవర్నర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..

10 Nov, 2023 15:17 IST|Sakshi

తమిళనాడు పంజాబ్‌ గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన  బిల్లులపై గవర్నర్లు ‌ వ్యవహరిస్తున్న తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది.

బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు చేస్తున్న జాప్యంపై  పంజాబ్‌, తమిళనాడు ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషిన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రజలు ఎన్నుకున్న నేతలు ద్వారా అసెంబ్లీలో ఆమెదం పొందిన బిల్లలు విషయంలో ఆలస్యం చేయవద్దని ఇరు రాష్ట్రాల గవర్నర్‌లకు సున్నితంగా హెచ్చరించింది. బిల్లులపై గవర్నర్ల చర్య తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది

‘మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు. సమావేశాలు సక్రమంగా జరగలేదన్న కారణంతో  అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు చెల్లవని గవర్నర్‌ ఎలా చెబుతారు. పంజాబ్‌లో గవర్నర్‌, సర్కార్‌కు మధ్య జరుగుతున్న పరిణామాలపై మేము సంతృప్తికరంగా లేము. ఇలాంటి చర్యల వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యన్ని కొనసాగిస్తామా?. ఇది చాలా తీవ్రమైన విషయం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.  స్థిరపడిన  సంప్రదాయాలపై భారత్‌ నడుస్తోందని, వాటిని అనుసరించాల్సిన అవరసం ఉందని నొక్కి చెప్పారు.

ఇదిలా ఉంటే... డీఎంకే నేతృత్వంలోని సర్కార్‌కు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య.. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వానికి గవర్నర్‌ పురోహిత్ మధ్య ఇటీవలి కాలంలో విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పాస్‌ చేయడంలో గవర్నర్లు ఉద్దేశ్యపూర్వకంగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వా‍లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ రెండు పిటిషన్‌లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. 
చదవండి: అందులో తప్పేముంది? మేం రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం: కాంగ్రెస్‌ ఎంపీ

పంజాబ్‌, తమిళనాడు ప్రభుత్వాల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్‌ గవర్నర్ల సమస్య పంజాబ్‌ నుంచి తమిళనాడుకు, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారికి విస్తరిస్తోందని, దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. గవర్నర్ల ప్రవర్తన రాజ్యంగ విరుద్ధమని.. ఆయన చర్య ప్రభుత్వ పాలనపై  ప్రభావం చూపుతుందని తెలిపారు.

అనంతరం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తీసుకున్న చర్యల వివరాలను తమకు అందజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది. ఈ కేసును దీపావళి తరువాత సోమవారం విచారిస్తామని చెబుతూ వాయిదా వేసింది.

కాగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు నవంబర్ 6న ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్లకు ఆత్మపరీశీలన అవసరమని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు