అత్యంత పురాతన మానవుల పాదముద్రలు లభ్యం

8 Oct, 2023 13:46 IST|Sakshi

అమెరికాలోని న్యూ మెక్సికోలో పురాతన మానవ పాదముద్రలను కనుగొన్నారు. ఇవి ఇక్కడి వైట్ సాండ్స్ నేషనల్ పార్క్‌లో గుర్తించారు. ఒక నూతన అధ్యయనంలో కనుగొన్న ఈ పాలియో-మానవ పాదముద్రలు 23,000 నుండి 21,000 సంవత్సరాల క్రితం నాటివని తెలుస్తోంది. 

ఈ మానవ పాదముద్రలు ఏనాటివో తెలుసుకునేందుకు అధ్యయనంలో రెండు పద్ధతులు ఉపయోగించారు. ఈ పాదముద్రలు కనిపించిన ట్రాక్‌వేలు 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని  అంచనా వేశారు. అంటే అవి మంచు యుగంలోని అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’ (26,500 నుండి 19,000 సంవత్సరాల క్రితం) కాలం నాటివి. 

13 వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వచ్చిన మొదటి మానవులు క్లోవిస్ ప్రజలు అని పురావస్తు శాస్త్రవేత్తలు గతంలో భావించారు. గత కొన్ని దశాబ్దాలలో పురావస్తు శాస్త్రవేత్తలు క్లోవిస్‌కు పూర్వం అంటే 13 వేల సంవత్సరాల క్రితం అమెరికాలో నివసించే వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అయితే ఆయా ప్రదేశాలలో చాలా వరకు ఆధారాలు నిర్థారించే స్థాయిలో లేవు.

వైట్ సాండ్స్ ట్రాక్‌వే ఇప్పుడు ఉత్తర అమెరికాలో పురాతన మానవులకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది. ఫలితంగా మొదటి అమెరికన్ల రాక తేదీని గణనీయంగా వెనక్కి నెట్టినట్లయ్యింది. కాథ్లీన్ స్ప్రింగర్‌తో కలిసి అధ్యయనానికి నాయకత్వం వహించిన జెఫ్రీ పిగటి మాట్లాడుతూ లాస్ట్ గ్లేసియల్ మాగ్జిమమ్ సమయంలోనే ప్రజలు ఇక్కడ ఉన్నారనడానికి మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు.
ఇది కూడా చదవండి: బిల్డింగ్‌ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి? 

మరిన్ని వార్తలు