Global Warming: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి?

4 Sep, 2023 09:38 IST|Sakshi

రాబోయే కాలం మానవులకు అత్యంత కష్టకాలంగా మారనుంది. కరోనా తరువాత వాతావరణ మార్పులు పెను వినాశనాన్ని తీసుకురాబోతున్నాయి. ఫలితంగా రాబోయే రోజుల్లో వంద కోట్ల మంది బలికానున్నారు. ఈ వంద కోట్ల మంది ఏదో ఒక ప్రాంతానికే చెందినవారేమీ కాదు.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మరణ మృదంగంలో సమిధలు కానున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం గురించి శాస్త్రవేత్తలు ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం. 

భయపెడుతున్న గణాంకాలు 
యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో ఇటీవల వాతావరణ మార్పులపై పరిశోధన నిర్వహించింది. ఈ పరిశోధన ద్వారా భవిష్యత్తులో పెరగబోయే ఉష్ణోగ్రతలు మానవుల మరణాలకు ఎలా కారణమవుతాయో తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన గణాంకాలు రాబోయే తరానికి పెను ముప్పుగా పరిణమించనున్నాయని ఈ పరిశోధన నిర్వాహకులు జాషువా పియర్స్ హెచ్చరించారు. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే మానవుల మరణాల సంఖ్యను ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, ఇది 100 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. 

మనిషి బతకాలంటే ఏం చేయాలి?
ఈ విపత్తును నివారించడానికి మనుషులంతా ముందుగా వాతావరణ మార్పులపై దృష్టి సారించాలి. దీనితో పాటు కర్బన ఉద్గారాలను తీవ్రంగా పరిగణించాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కర్బన ఉద్గారాల కట్టడికి చర్యలు చేపట్టాలి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏటా భూతాపం పెరుగుతున్న తీరు చూస్తుంటే రానున్న కాలంలో ప్రపంచం నిప్పుల కొలిమిలా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

అదేవిధంగా ప్రపంచంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరగా నిలిపివేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శిలాజ ఇంధనాలు వాతావరణ మార్పులకు గల  కారణాలలో ప్రధానమైనవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని ప్రభుత్వాలు కార్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్, కార్బన్ డయాక్సైడ్‌ను సహజంగా నిల్వ చేయడానికి దోహదపడేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తే, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఐబీఎంలో కూర్చుని రెజ్యూమ్‌ రూపొందించిన రతన్‌ టాటా

మరిన్ని వార్తలు