బైడెన్‌ వ్యాఖ్యలపై పాక్‌ ప్రధాని ఫైర్‌

16 Oct, 2022 12:31 IST|Sakshi

ఇస్లామాబాద్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాకిస్తాన్‌ అణ్వాయుధాల సామర్థ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చాలా ఘాటుగా స్పందించారు. గత దశాబ్దాలుగా అణ్వాయుధాల విషయంలో పాక్‌ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించుకుంది. తమ అణు కార్యక్రమాలను ఫూల్‌ ఫ్రుఫ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు షెహబాజ్‌ ట్విట్టర్‌లో... అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాక్‌ బాధ్యతయుతమైన అణుదేశం. అంతర్జాతీయ అణుశక్తి(ఐఏఈఏ) అవసరాలకు అణుగుణంగా మా అణ్వాయుధాలకు అత్యుత్తమ రక్షణ వ్యవస్థ ఉంది. దీనికి మేము గర్విస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ...జాతీయ ప్రయోజనాలను పరిరక్షించగల  బాధ్యతాయుతమైన అణుదేశం పాక్‌. అన్ని స్వతంత్ర  దేశాల మాదిరిగా మా అణుకార్యక్రమాల వల్ల ఏ దేశానికి ముప్పు వాటిల్లదు. మేము ప్రాంతీయ శాంతి భద్రతలను పెంపొందించడంలో యూఎస్‌కి సహకరించాలన్నదే మా కోరిక.

దయచేసి అణు సామర్థ్యం విషయంలో లేనిపోని సందేహాలకు తావివ్వద్దు. అలాగే పాకిస్తాన్ తన స్వయంప్రతిపత్తి సార్వభౌమ రాజ్యాధికారం తోపాటు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే హక్కును కలిగి ఉంది అని షెహబాజ్‌ ట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందిస్తూ...బైడెన్‌ దేన్ని ఆధారం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారంటూ నిలదీశారు. ముఖ్యంగా అణ్వాయుధీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో పాల్గొన్న యూఎస్‌లా పాకిస్తాన్ ఎప్పుడు దూకుడుగా వ్యవహరించింది అని ప్రశ్నించారు.

(చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు)

>
మరిన్ని వార్తలు