ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన సాధారణ ఎన్నికలు జరుపుతామని అధ్యక్షుడు అరిఫ్ అల్వీ గురువారం ప్రకటించారు. దేశంలో ఆర్థిక అస్థిరత తీవ్రరూపం దాలి్చన ఈ సమయంలో అధ్యక్షుడితో చర్చించి, ఎన్నికల తేదీని ఖరారు చేయాలంటూ అంతకుముందు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ మేరకు ఎన్నికల కమిషన్(ఈసీపీ) చీఫ్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రజా, కమిషన్లోని నలుగురు సభ్యులు, అటార్నీ జనరల్ ఉస్మాన్ అవాన్ కలిసి అధ్యక్షుడు అరిఫ్ అల్వీని కలిశారు. ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపారు. అనంతరం ఎన్నికల తేదీని 2024 ఫిబ్రవరి 8గా నిర్ణయించినట్లు అధ్యక్షుడు ప్రకటించారు.