పంది గుండె అమర్చిన మరో వ్యక్తి మృతి

1 Nov, 2023 17:07 IST|Sakshi

పంది గుండెను అమర్చిన మరో వ్యక్తి మరణించాడు. లారెన్స్ ఫాసెట్(58)  అనే వ్యక్తికి సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. దాదాపు 40 రోజుల తర్వాత గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ మృతి చెందారని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ వైద్యులు తెలిపారు. గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన నెలరోజుల వరకు చక్కగా పనిచేసిందని వెల్లడించాడు. ఆ తర్వాత గుండె పనితీరు క్షీణించడం మొదలయ్యిందని పేర్కొన్నారు.

'గుండె మార్పిడి చేసిన తర్వాత లారెన్స్ ఆరోగ్యంగా గడిపారు. ఫిజికల్ థెరపీలో కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశారు. భార్య యాన్‌తో కార్డ్స్‌ కూడా ఆడేవారు. కానీ ఇటీవల గుండె పనితీరులో వైఫల్యం కనిపించింది. మానవ అవయవాల మార్పిడి విధానంలో ‍ఇది అతి క్లిష్టమైన పద్దతి. ఆరు వారాలపాటు ఆరోగ్యంగా గడిపారు. కానీ సోమవారం ప్రాణాలు కోల్పోయారు.' అని మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  

లారెన్స్ నావీలో పనిచేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో టెక్నీషియన్‌గా రిటైర్ట్ అయ్యారు. గుండె సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో హర్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. ఎట్టకేలకు గుండె మార్పిడి చేయగా ఇన్నాళ్లు బతికారని లారెన్స్ భార్య యాన్ తెలిపారు.

జంతువుల అవయవాలను మానవులకు మార్పిడి చేసే పద్దతిని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఇది మానవ అవయవ దాతల కొరత సమస్యను తగ్గిస్తుంది. ఈ ప్రక్రియ సవాలుగా మారింది. రోగి రోగనిరోధక వ్యవస్థ మార్పిడి అవయవం పనితీరుకు సరిపోలడం క్లిష్టతరమైంది. పంది భాగాలను జన్యుపరంగా మార్పు చేయడం వల్ల మానవ అవయవాలలాగా పనిచేస్తాయని వైద్యులు భావించారు. 

ఇదీ చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం


 

మరిన్ని వార్తలు