● ఓటును సరైన రీతిలో వినియోగిస్తే
ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం
● గ్రూప్స్, ఎంసెట్ పేపర్ల లీకేజీలతో
యువత భవిష్యత్ అస్తవ్యస్తం
● విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
కల్పించే వారికే పట్టం
● ‘సాక్షి’ చర్చా వేదికలో
యువ ఓటర్ల మనోగతం
గద్వాల రూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ఓటు హక్కును సరైన రీతిలో వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని యువ ఓటర్లు అభిప్రాయ పడ్డారు. గురువారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో గద్వాల నవోదయ మహిళా డిగ్రీ కళాశాలలో యువతతో చర్చావేదిక నిర్వహించింది. ఈ సందర్భంగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువత పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఇటీవల గ్రూప్స్ పేపర్స్ లీకేజీ, ఎంసెట్ పేపర్ లీకేజీ వంటి యువత భవిష్యత్తును నిర్దేశించే పోటీ పరీక్షలన్నీ కూడా లీకేజీల పేరిట రద్దవుతూ.. వాయిదాలు పడుతూ అస్తవ్యస్తంగా మారాయని అభిప్రాయపడ్డారు. యువతకు అవసరమైన విద్య, ఉపాధి, నైపుణ్యత వంటి అంశాల గురించి ఆలోచించే నాయకుడు, ప్రభుత్వాలు లేకపోవడం శోచనీయమన్నారు. డిగ్రీ తరువాత ఏదైన ఉద్యోగం కోసం శిక్షణకు వెళ్లాలంటే హైదరాబాద్, మహబూబ్నగర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, అక్కడ రూ.వేలకు వేలు ఫీజులు కట్టి ఇబ్బందులు పడుతూ కష్టపడి చదివితే ఆ పరీక్షలు లీకేజీలు, ఇతరత్రా కారణాల చేత వాయిదాలు, రద్దు అవుతుండడం మాలాంటి రాబోయే తరానికి నిజంగా ఆందోళన కలిగించే అంశమని అన్నారు. మార్పు రావాలంటే పని చేసి, అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని.. కానుకలు, ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా సమర్ధవంతమైన అభ్యర్థికి ఓటు వేస్తే ప్రజాస్వామ్యం పరిరక్షణించబడుతుందన్నారు. ఈక్రమంలోనే మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న తాము ఎంతో ఉత్సాహంగా ఉన్నామని తెలిపారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..