ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా! : మేయర్‌ వై.సునీల్‌రావు

18 Dec, 2023 00:14 IST|Sakshi
మాట్లాడుతున్న మేయర్‌ సునీల్‌రావు

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌లపై ఎంపీవి మతిభ్రమించిన మాటలు

మేయర్‌ వై.సునీల్‌రావు

కరీంనగర్‌: ఎంపీ బండి సంజయ్‌ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, అసహనంతో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌లపై మతిభ్రమించి మాట్లాడుతున్నారని మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడం, యువతను రెచ్చగొట్టడం ఎంపీ నైజమని పేర్కొన్నారు.

అవినీతి ఆరోపణలు చేయడం కాదని.. వాటిని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకుటే క్షమాపణ చెప్పి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో రూపాయి లేదని చెప్పి, గెలిచి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రూ.50 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. మున్సిపల్‌, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు. ఎంపీగా గెలిచాక బండి సంజయ్‌ ఈ ఐదేళ్లలో ఏనాడూ ప్రజల మధ్యలో లేరన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశారని ఆరోపించారు.

ప్రలోభాలకు లొంగనివారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ల నాయకత్వంలో కరీంనగర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఎంపీ చేసిందేమిటో చెప్పాలన్నారు. కార్పొరేటర్లు గంట కల్యాణి, ఐలేందర్‌ యాదవ్‌, గందె మాధవి, సల్ల శారద, కోల మాలతి, కుర్ర తిరుపతి, వంగల శ్రీదేవి, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

ప్రజలే ‘బండి’ని సీజ్‌ చేశారు!
ఎంపీ బండి సంజయ్‌ అర్థం లేని మాటలు మానుకోవాలని, ఎమ్మెల్యేగా ఓటమి చెందాననే నిరాశలో కేసీఆర్‌, కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్‌ తెలంగాణను అన్ని రంగాల్లో ముందు నిలిపారన్నారు. ఐదేళ్లలో ఎంపీగా కరీంనగర్‌ పార్లమెంట్‌ అభివృద్ధి కోసం తెచ్చిన నిధుల వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలని మాట్లాడుతున్న బండి సంజయ్‌ని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే సీజ్‌ చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేయకుండా బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసి, మాట్లాడటం దేనికి నిదర్శమని ప్రశ్నించారు.
ఇవి చ‌ద‌వండి: 'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్‌ శంకర్‌నాయక్‌

>
మరిన్ని వార్తలు