ఖమ్మంవన్టౌన్: ఉమ్మడి జిల్లాలోని అన్ని సీట్లను గెలిచి ఈసారి అధికారంలోకి రాబోతున్నందున ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మంలో సోమవారం జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, సీపీఐ శ్రేణులు సమష్టిగా పనిచేస్తూ పార్టీని విజయతీరాలకు చేర్చాలని కోరారు. అనంతరం మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉన్నందున రానున్న పదిహేను రోజులు కష్టపడితే విజయం మరింత సులువవుతుందని తెలిపారు. కొత్త, పాత తేడా లేకుండా అందరినీ కలుపుకెళ్లాలని సూచించారు. ఉమ్మడి జిల్లానే కాక కాక తెలంగాణలో 75కి పైగా స్థానాల్లో గెలిచి అధికారంలోకి రాబోతున్నామని తెలిపారు. ఆతర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆత్మగౌరవంతో బతికే వాతావరణం కావాలంటే తనను గెలిపించాలని కోరారు. ఎవరు ఏమరపాటుగా ఉన్నా ఇబ్బంది ఎదురవుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అలాగే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాపం పండగా, అందులో పాలు పంచుకున్న వారూ బాధ్యులుగా నిలబడాల్సి వస్తుందని చెప్పారు. ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటితో సహా అన్ని స్థానాల్లో గెలుపు కోసం సీపీఐ పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జావీద్, కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ నాయకులు పోటు ప్రసాద్, వాసిరెడ్డి రామనాథం, కూరపాటి వెంకటేశ్వర్లు, కమర్తపు మురళి, మిక్కిలినేని మంజుల, రావూరి కరుణ, లకావత్ సైదులు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, దీపక్చౌదరి, మానుకొండ రాధాకిశోర్, వడ్డెబోయిన నర్సింహారావు, కొత్తా సీతారాములు, పొదిల రవికుమార్, దొబ్బల సౌజన్య, కొంగర జ్యోతిర్మయి, కేతినేని హరీష్,బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ తదతరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిన ఎంపీపీ
నేలకొండపల్లి: నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య బీఆర్ఎస్కు సోమవారం రాజీనామా చేశారు. ఎంపీపీతో పాటు ఆమె భర్త, వారి అనుచరులు పలువురు సోమవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులుకండువా కప్పి ఆహ్వానించారు. అయితే, ఎంపీపీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం
సమన్వయ భేటీలో ఎల్పీ నేత భట్టి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
పాల్గొన్న తుమ్మల, కూనంనేని సాంబశివరావు