రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విధి నిర్వహణలో అప్రమత్తంగా, సకాలంలో చురుగ్గా స్పందించి ప్రమాదాల నివారణకు కృషి చేసిన విజయవాడ డివిజన్కు చెందిన నలుగురు ఉద్యోగులకు జీఎం ‘మ్యాన్ ఆఫ్ ద మంత్’ సేఫ్టీ అవార్డులను దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రకటించారు. సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జీఎం అరుణ్కుమార్ జైన్ విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో సోమవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన అవార్డులను ప్రకటించారు. ఈ మేరకు విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మంగళవారం తన కార్యాలయంలో ఆయా ఉద్యోగులకు ఈ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ.. విజయవాడ డివిజన్లో పనిచేస్తున్న ట్రాక్ మెయిటెనర్ ఆర్.అశ్రునాయుడు, గూడ్స్ లోకో పైలెట్ కె.సతీష్బాబు, మెకానికల్ విభాగంలో పనిచేస్తున్న పి.అవినాష్, రాజమండ్రి సీ అండ్ డబ్ల్యూ బ్రాంచ్లో పని చేస్తున్న ఎస్.వీరా రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.