జగ్గయ్యపేట: పట్టణంలో ఈ నెల 24న జరగనున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, శాసన మండలి సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూర్చారని చెప్పారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో ముఖ్యమంత్రి చోటు కల్పించారన్నారు. రాష్ట్రంలో సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో తొలిసారిగా జగ్గయ్యపేటలో యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. రెండు కిలోమీటర్ల మేర యాత్ర తర్వాత బహిరంగ సభ ఉంటుందని వివరించారు.
బహిరంగ సభ స్థల పరిశీలిన..
పట్టణంలోని బలుసుపాడు సెంటర్, పాతగడ్డ, పాత మున్సిపల్ సెంటర్లలోని సభా స్థలాలను వారు పరిశీలించారు. ముక్త్యాల రోడ్డులోని పాతగడ్డ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని నిర్ణయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు రంగాపురం రాఘవేంద్ర, తుమ్మల ప్రభాకర్, పట్టణ కన్వీనర్ ఆకుల బాజీ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్,ఎమ్మెల్యే సామినేనితో కలిసి సభాస్థలి పరిశీలన