ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్‌తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం!

21 Oct, 2023 11:38 IST|Sakshi
విజయ్‌కుమార్‌ (ఫైల్‌), జగదీష్‌ (ఫైల్‌), షఫి ఉల్లా (ఫైల్‌)

ముందు వెళ్తున్న వాహనాన్నిఢీకొట్టిన డీసీఎం..

అక్కడికక్కడే ముగ్గురి దుర్మరణం!

కోళ్లను తరలిస్తున్న డీసీఎం..

డ్రైవర్‌ అతివేగం, నిద్రమత్తు కారణంగా..

సాక్షి, మహబూబ్‌నగర్‌: నిద్రమత్తు ముగ్గురి ప్రాణాలను తీసింది. డ్రైవర్‌తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మహేశ్వరం మండలం కందుకూర్‌ నుంచి కర్ణాటక రాష్ట్రం చిక్‌మంగళూర్‌కు కోళ్లను తరలిస్తున్న డీసీఎం.. డ్రైవర్‌ అతివేగం, నిద్రమత్తు కారణంగా గురువారం అర్ధరాత్రి మక్తల్‌ మండలం బొందల్‌కుంట స్టేజీ సమీపంలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం వసుదుర్గాకు చెందిన డీసీఎం డ్రైవర్‌ విజయ్‌కుమార్‌ (40)తో పాటు కోళ్లను లోడ్‌ చేసేందుకు వెళ్లిన అంబ్లే గ్రామానికి చెందిన జగదీష్‌ అలియాస్‌ మంజు (37), భద్రావతికి చెందిన షఫివుల్లా (35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

విషయం తెలుసుకున్న డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాంలాల్‌, ఎస్‌ఐ పర్వతాలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటికి తీశారు. డ్రైవర్‌ విజయ్‌కుమార్‌కు భార్య కుమార్‌బాయితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగదీష్‌కు (మంజు)కు భార్య గీత, ఇద్దరు పిల్లలు, షఫి ఉల్లాకు భార్య షాభానుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ పర్వతాలు తెలిపారు.
Follow the Sakshi TV channel on WhatsApp:

మరిన్ని వార్తలు