62 సెన్సార్‌ కట్స్‌.. విచారం వ్యక్తం చేసిన దర్శకుడు

1 Nov, 2023 14:59 IST|Sakshi

'రారా సరసకు రారా' చిత్రానికి సెన్సార్‌ బోర్డు 62 చోట్ల కత్తెరకు పని చెప్పిందని నిర్మాత జయలక్ష్మి తెలిపారు. వేలూరులో చిత్ర షూటింగ్‌ నిర్వహిస్తున్న సమయంలోనూ పోలీసులు, ఇన్‌స్పెక్టర్‌, కమిషనర్‌ స్థాయి నుంచి పలు సమస్యలను ఎదుర్కొన్నామని, కాట్పాడి రాజన్‌ తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు. స్కై వండర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈమె నిర్మించిన చిత్రం రారా సరసకు రారా. ఈ చిత్రానికి కేశవ్‌ దబర్‌ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్‌ 3వ తేదీ విడుదల కానుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. లేడీస్‌ హాస్టల్‌లో ఒక్క రాత్రి జరిగే కథా చిత్రం అని చెప్పారు. నిత్యం పలు సమస్యలతో సతమతమయ్యే ప్రజలు రెండు గంటల పాటు హాయిగా చూసి ఎంజాయ్‌ చేసే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. సెన్సార్‌ బోర్డు నిబంధనలు 5 ఏళ్లకు ఒకసారి మారాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడో 1952లలో సెన్సార్‌ విధి విధానాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అన్నారు. తమ చిత్రానికి 62 కట్స్‌ ఇచ్చారని తెలిపారు. అందుకే తనను 62 కట్స్‌ చిత్ర దర్శకుడు అంటున్నారని తెలిపారు.

రారా సరసకు రారా చిత్రం టైటిల్‌కే అభ్యంతరం తెలిపారని, ఇంతకు ముందు ఎన్నో చిత్రాలకు అభ్యంతరం చెప్పినా సెన్సార్‌ బోర్డు తమ చిత్రానికి చాలా కట్స్‌ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రివైజింగ్‌ కమిటీకి వెళ్లినట్లు, నటి గౌతమి సభ్యురాలిగా ఉన్న ఆ కమిటీలోనూ పలుమార్లు చర్చ జరిగిందని చెప్పారు. తాము యు సర్టిఫికెట్‌ కోరలేదని, వారు ఎన్ని కట్స్‌ చెప్పినా ఓకే చెప్పడానికి సిద్ధమయ్యామని దర్శకుడు పేర్కొన్నారు. లేడీస్‌ హాస్టల్‌లో జరుగుతున్న అనర్థాలను చెప్పడమే తమ చిత్ర ప్రధాన ఉద్దేశం అని దర్శకుడు తెలిపారు.

చదవండి: ఐశ్వర్యరాయ్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఏడువందల కోట్లకు పైగా ఆస్తులు

మరిన్ని వార్తలు