Fardeen Khan: తను చనిపోయినట్లు వచ్చిన వార్తలపై నటుడి ఆగ్రహం..

26 Mar, 2022 14:00 IST|Sakshi

Actor Fardeen Khan Reacts To Fake News On His Death: సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫేక్‌ వార్తలు హల్‌చల్ చేస్తుంటాయి. పెళ్లి, ప్రేమాయణం, బ్రేకప్‌ వంటి పుకార్లతో సెలబ్రిటీలు చిరాకు పడిపోతుంటారు. అవి వారి సినీ కెరీర్‌పైనే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇబ్బందిపెడుతుంటాయని బాధ వెళ్లబోసుకున్న తారలు ఉన్నారు. ఇలాంటి సంఘటన ప్రముఖ నటుడు ఫర్దీన్‌ ఖాన్‌కు ఒకటి కాదు రెండు సందర్భాల్లో జరిగిందట. తాను కొన్నేళ్లు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నానని, అప్పుడు ఓ యాక్సిడెంట్‌లో చనిపోయినట్లు ఇప్పటికీ రెండు సార్లు రూమర్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పుకార్లతో ఎంతో కలత చెందానని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన విషయం ఏంటి ?' అని అడిగిన ప్రశ్నకు ఫర్దీన్ ఖాన్‌ ఈ విషయం చెప్పుకొచ్చారు. 

'నేను కొంతకాలం హిందీ సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నాను. ఆ సమయంలో నేను ఒక యాక్సిడెంట్‌లో చనిపోయానని రెండుసార్లు వార్తలు వచ్చాయి. అది నన్ను చాలా బాధించింది. ఎందుకంటే ఈ వార్త విని మా అమ్మకు గుండెపోటు వస్తే. లేదా ఇది చూసి నా భార్య ఎలా రియాక్ట్ అవుతుందో కూడా చెప్పలేను. అందుకే నేను చనిపోయానన్న వార్త విన్నా, చదివినా నాకు బాధ, చిరాకు తెగ వచ్చేవి. ఇంత బాధ్యాతరాహిత్యంగా ఎలా ఉంటారని అనిపించేది.' అని ఫర్దీన్ ఖాన్ తెలిపారు. ఆయన 2010లో సుస్మితా సేన్‌తో కలిసి నటించిన 'దుల్హా మిల్‌గయా' సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు తాజాగా రితేష్‌ దేశ్‌ముఖ్‌తో కలిసి 'విస్ఫోట్‌' అనే సినిమాలో అలరించనున్నారు. వీరిద్దరూ 'హే బేబీ' సినిమాలో చివరిగా కలిసి నటించారు. ఇప్పుడు సుమారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించనున్నారు. 

మరిన్ని వార్తలు