మహిళా జర్నలిస్టులపై వ్యాఖ్యలు.. ప్రముఖ నటుడికి జైలు శిక్ష

20 Feb, 2024 06:25 IST|Sakshi

కోలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత ఎస్వీ శేఖర్‌కు నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించించింది. వివరాలు.. 2018లో ఎస్వీ శేఖర్‌ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి 2018లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆరోపిస్తూ పోస్ట్‌ పెట్టాడు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వివాదం రేగింది.. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎస్వీ శేఖర్‌ క్షమాపణ చెప్పారు. కానీ కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును సైతం శేఖర్‌ ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్‌ ఆ వరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయ వేల్‌ విచారిస్తూ వచ్చారు. వాదనలు ముగియడంతో సోమవారం తీర్పు వెలువరించారు.

ఎస్వీశేఖర్‌కు నెలు రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధించారు. అదే సమయంలో అప్పీల్‌కు అవకాశం కల్పించాలని ఎస్వీశేఖర్‌ తరపున న్యాయమూర్తికి న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవకాశం కల్పిస్తూ తాత్కాలికంగా శిక్షను నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పీల్‌ కోసం రెండు నుంచి నాలుగు వారాలలోపు ప్రయత్నాలు చేసుకోవాలని, ఆ తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత కోర్టులో లొంగి పోవాలని ఆదేశాలు జారీ చేశారు.

whatsapp channel

మరిన్ని వార్తలు