ప్రపంచ సుందరి పోటీలు.. భారత్‌ బ్యూటీ ఎవరో తెలుసా?

20 Feb, 2024 08:42 IST|Sakshi

సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 9 వరకు కొనసాగుతుంది.  మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ వేదికగా నిలిచింది చివరిసారిగా 1996లో బెంగళూరులో ఈ పోటీలు నిర్వహించారు. 71వ మిస్ వరల్డ్‌లో 130కి పైగా దేశాల నుంచి  పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడనున్నారు.

నా దేశపు జెండాను గుండెల్లో పెట్టుకున్నా: సినీ శెట్టి

భారత్‌ నుంచి కన్నడ బ్యూటీ సినీ శెట్టి (21) మిస్ వరల్డ్ కోసం బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో ఆమె దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఆమె జాతిని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పేర్కొన్నారు. ' తూ హీ మేరీ మంజిల్ హై, పెహచాన్ తుజ్ హై సే!" అనే పోస్ట్‌ను పంచుకున్నారు. (నువ్వే నా లక్ష్యం, నువ్వే నా గుర్తు) ఈ ప్రయాణంలో ఈరోజు నేను నాకంటే ఉన్నత స్థానంలో ఉన్నాను.. నా దేశపు త్రివర్ణ పతాకాన్ని చేతిలోనే కాదు, గుండెల్లో పెట్టుకున్నాను..' అంటూ గర్వం వ్యక్తం చేశారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముంబైలో జన్మించిన సినీ శెట్టి స్వస్థలం కర్ణాటక. అకౌంటింగ్, ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేట్ చేసిన ఈ బ్యూటీ భరతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరుగుతున్నందున విభిన్న మార్గాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

నేను నా దేశపు గర్వాన్ని: సినీ శెట్టి
71వ మిస్ వరల్డ్ పోటీలకు తొలి అడుగు పడింది. ' నేను నా కలలతో అడుగులు వేస్తున్నాను. నేను నా దేశపు గర్వాన్ని.. ఈ క్షణం నుంచి నేను సినీ శెట్టిని మాత్రమే కాదు.. నేను భారతదేశాన్ని. నేను వేసే ప్రతి అడుగు, నేను మాట్లాడే ప్రతి మాట, నన్ను పెంచిన ఈ నేల, నన్ను తీర్చిదిద్దిన భారత సంస్కృతి, నన్ను నమ్మిన ప్రజల ప్రతిబింబాన్ని. నేను మన జాతీయ జెండాను ఎంతో గర్వంగా, గౌరవంగా పట్టుకుని నిల్చున్నాను. ఇది నా కోసం, మన కోసం, భారతదేశం కోసం.' అని సినీ శెట్టి క్యాప్షన్ ఇచ్చారు. భారత్‌ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లోకి అడుగు పెట్టిన ఆమెకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

1966లో భారత్‌కు చెందిన రీటా ఫారియా తొలిసారి ప్రపంచ సుందరి కిరీటాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్‌  1997లో డయానా హేడెన్‌, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్‌ 'మిస్‌ వరల్డ్' కిరీటాన్ని దక్కించుకున్నారు. 2022లో  నిర్వహించిన పోటీల్లో పోలెండ్‌కు చెందిన కరోలినా బిలాస్కా విజేతగా నిలిచారు. ఈ ఏడాది గెలుపొందిన వారికి ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించనున్నారు.  మార్చి 9న ముంబైలో జరగనున్న ఫైనల్‌ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు.

A post shared by Femina Miss India (@missindiaorg)

whatsapp channel

మరిన్ని వార్తలు