Akhil Akkineni: రెండు సీన్లు చూశా... థ్రిల్‌ అయ్యా!

17 Feb, 2023 02:53 IST|Sakshi

‘‘గీతా ఆర్ట్స్‌ ఈవెంట్‌కు నేను ఓ కుటుంబసభ్యుడిలా వచ్చాను. కొత్తదనం కోసం అరవింద్‌గారు ఎప్పుడూ తాపత్రయపడుతుంటారు. కష్టం ఎప్పుడూ వృథా కాదు. కిరణ్‌ ఎంతో కష్టపడుతున్నాడు. తనకు ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు అక్కినేని అఖిల్‌. కిరణ్‌ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా మురళీ కిషోర్‌ (నందు) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్‌ మాట్లాడుతూ– ‘‘వినరో..’లోని రెండు సీన్లు చూసి, థ్రిల్‌ అయ్యాను. ట్విస్ట్స్‌ అండ్‌ టర్న్స్‌తో ఈ సినిమా వస్తోంది ’’ అని అన్నారు. ‘‘జెన్యూన్‌గా ఉండే కిరణ్‌లాంటి వ్యక్తులు తక్కువ. బన్నీ వాసుతో పాటు కిరణ్‌ అబ్బవరంనూ ఓ నిర్మాతగా ఫీలవుతున్నాను. ఈ సినిమాకు అతను అలా వర్క్‌ చేశాడు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌.

‘‘అఖిల్‌గారి సినిమాలో నేను ఓ కీ రోల్‌ చేయాల్సింది. కుదర్లేదు. ఏయన్నార్‌గారు చేసిన ‘మనం’ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ ఎమోషన్‌. స్క్రీన్‌పై గీతా ఆర్ట్స్‌ అని చూసిన మాలాంటి వారు కూడా అదే బ్యానర్‌లో సినిమాలు చేయొచ్చు అంటూ చాన్స్‌ ఇచ్చిన అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు. నాలా సినిమాపై ప్యాషన్‌తో వచ్చేవారి తరపున అల్లు అరవింద్‌గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. ‘వినరో. ..’ సినిమా బాగా రావడానికి ఎంతో కారణమైన బన్నీ వాసుగారి దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.

ఈ మూవీతో నందు అన్నకు మంచి పేరు వస్తుంది. యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్‌ ‘గచ్చిబౌలి’ నుంచి నేను ఇక్కడి వచ్చేంతవరకు నన్ను ప్రోత్సహించిన, ఇంకా సపోర్ట్‌ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ‘వినరో..’ పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. ‘‘నేను దర్శకుడిని అయ్యానని మా నాన్నకు నేను హ్యాపీగా చెప్పుకునేలా చేసిన కిరణ్‌ అబ్బవరంకు, నిర్మాతలు అరవింద్, బన్నీ వాసుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు మురళీ కిషోర్‌. ‘‘గీతా ఆర్ట్స్‌ తర్వాత నాగచైతన్య, అఖిల్‌ నాకు ఆప్తులు. నా మనసుకు కనెక్ట్‌ అయిన సినిమా ఇది. ఈ సినిమా చూశాక ఆడియన్స్‌ కొన్ని అంశాలను వెంట తీసుకెళ్తారు. కిరణ్, కిశోర్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేతన్‌లకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు బన్నీ వాసు.

మరిన్ని వార్తలు