Aha 2.0 Launch: ఇక నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుంది

3 Nov, 2021 10:53 IST|Sakshi
రామ్‌ రావ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, అల్లు బాబీ

Allu Arjun Launched AHA 2.0: ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ఆదరణ వల్లే ‘ఆహా’ మంచి స్థాయికి చేరుకుంది. నంబర్‌ వన్‌ సక్సెస్‌ ఫుల్‌ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఆహా కొనసాగుతున్నందుకు గర్వంగా ఉంది’’ అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. హైదరాబాద్‌లో ‘ఆహా 2.0’ ఓటీటీ వెర్షన్‌ను అల్లు అర్జున్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆహా’ సక్సెస్‌కు ముఖ్య కారకులైన నాన్నగారు (అల్లు అరవింద్‌), జూపల్లి రామేశ్వర్‌రావు, రామ్‌ జూపల్లిగార్లకు శుభాకాంక్షలు. మాకు తోడుగా ఉంటున్న నిర్మాత ‘దిల్‌’రాజు, సపోర్ట్‌ చేస్తున్న వంశీ పైడిపల్లికి, ఎంతో కష్టపడుతున్న అజిత్‌కు థ్యాంక్స్‌.

 ముఖ్యంగా ‘ఆహా’ టీమ్‌కు కంగ్రాట్స్‌.. ఈ సక్సెస్‌లో వారి పాత్ర చాలా ముఖ్యం. ‘ఆహా 2.0’ నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటుంది. ప్రతి శుక్రవారం ‘ఆహా’లో కొత్త రిలీజ్‌ ఉంటుంది.. ‘ఆహా’ లోని ‘సినిమాపురం’ సర్‌ప్రైజ్‌ గురించి త్వరలో చెబుతాం’’ అన్నారు. ఆహా ప్రమోటర్స్‌లో ఒకరైన అల్లు అరవింద్‌ మాట్లాడుతూ–‘‘2020 ఫిబ్రవరిలో ‘ఆహా’ని లాంచ్‌ చేశాం. నా విజన్‌ని సపోర్ట్‌ చేసి నాకు ధైర్యాన్నిచ్చిన జూపల్లి కుటుంబానికి థ్యాంక్స్‌. ఇప్పటి వరకూ ‘ఆహా’లో మీరు చూసిన కంటెంట్‌ వేరు.. ‘ఆహా 2.0’ లో ఇకపై రాబోతున్న కంటెంట్‌ వేరు’’ అన్నారు.  దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ‘‘పాట అనేది మనందరి జీవితంలో ఒక భాగం. మనం ఉన్నంత వరకూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి పాటలు వింటూనే ఉంటాం. ‘అమెరికన్‌ ఐడల్‌’ అనేది పెద్ద టాలెంట్‌ షో.  2004లో ‘ఇండియన్‌ ఐడల్‌’గా మనదేశానికొచ్చింది. తొలిసారి దక్షిణాదిలో ‘తెలుగు ఐడల్‌’ని ‘ఆహా’లో లాంచ్‌ చేయబోతున్నాం. తెలుగువారందరూ ‘తెలుగు ఐడల్‌’ ఆడిషన్స్‌ పాల్గొనొచ్చు’’ అన్నారు. ఈ వేడుకలో వివిధ విభాగాల్లో ‘ఆహా’ అవార్డులను అందించారు. ఆహా ప్రమోటర్స్‌ రామ్‌ రావ్‌ జూపల్లి, అజిత్, నిర్మాతలు నాగవంశీ, శరత్‌ మరార్, ఎస్‌కేఎన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు