పాన్‌ మసాల బ్రాండ్‌కు అమితాబ్‌ లీగల్‌ నోటీసు..

21 Nov, 2021 12:58 IST|Sakshi

బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  ఒక పాన్‌ మసాల బ్రాండ్‌కు లీగల్‌ నోటీసు పంపారు. గత నెలలో బిగ్‌ బీ పాన్‌ మసలా బ్రాండ్‌ కాంట్రాక్ట్‌ రద్దు చేసుకుని, అందుకు తీసుకున్న డబ్బును తిరిగి ఇచ‍్చారని తెలిపారు. అయిన ఇ‍ప‍్పటికీ తాను ప్రమోట్‌ చేస్తున్నట‍్లుగా ప్రకటనలు ప్రసారం కావడంతో లీగల్‌ నోటీస్‌ పంపారు అమితాబ్‌. ఈ ప్రకటనల ప్రసారం రద్దు చేయాలని 'కమలా పసంద్‌' పాన్‌ మసాల బ్రాండ్‌కు అమితా బచ్చన్‌ కార్యాలయం నుంచి లీగల్‌ నోటీస్‌ వెళ్లింది. ఇకపై పాన్‌ మసాల బ్రాండ్‌ ప్రమోషన్లతో అమితాబ్‌ బచ్చన్‌కు సంబంధం లేదని అక్టోబర్‌లో అమితాబ్‌ బచ్చన్‌ కార్యాలయం ఒక పోస్ట్‌ చేసింది. 

'అమితాబ్‌, పాన్‌ మసాల బ్రాండ్‌ ప్రకటన ప్రసారం అయిన కొన్ని రోజులకు అందులోనుంచి వైదొలిగారు. ఎందుకంటే ఒప్పందం చేసుకునేప్పుడు, అది సర్రోగేట్‌ అడ్వర్టైజింగ్ కిందకు వస్తుందని తెలియదు. అమితాబ్‌ బచ్చన్‌ ఈ బ్రాండ్‌తో ఒప్పందాన‍్ని రద్దు చేసుకున్నారు. ప్రమోషన్‌ కోసం తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చారు.' అని పోస్టులో పేర్కొంది. ఈ పాన్‌ మసాల బ్రాండ్‌ ప్రకటనలో నటించిన కారణంగా 79 ఏళ్ల అమితాబ్ బచ్చన్‌కు పలు ఎదురుదెబ్బలు తగిలాయి. స్క్రీన్‌ ఐకాన్‌కు చెందిన పలువురు అభిమానులు ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి అమితాబ్‌ ఎలా ఒప్పుకున్నారని అసంతృప్తి వ్యక్తపరిచారు.  
  
సెప్టెంబర్‌ 2021లో జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ (నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ టొబాకో ఎరాడికేషన్‌-NOTE) అనే ఎన్జీవో కూడా పాన్‌ మసాల బ్రాండ్‌లను ప్రమోట్‌ చేసే ప్రకటనలో భాగం కావొద్దని అమితాబ్‌ బచ్చన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ పాన్‌ మసాల ప్రకటనల నుంచి వైదొలిగి, పొగాకు వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నోట్‌ అ‍ధ్యక్షుడు డాక్టర్‌ శేఖర్ సల్కర్‌ బహిరంగ లేఖలో కోరారు.  
 

మరిన్ని వార్తలు