Anukreethy Vas: 'ఐదేళ్ల క్రితం అదేంటో తెలియదు.. కానీ ఇప్పుడదే ట్రెండ్'

8 Nov, 2023 12:11 IST|Sakshi

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సోషల్‌ మీడియా జీవితంలో ఒక భాగం అయిందంటే అతిశయోక్తి కాదు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో సెల్‌ఫోన్‌ అనే పరికరంతో ప్రపంచమే అరచేతిలో గిరాగిరా తిరుగుతోంది. మనిషి దాని చుట్టూ తిరుగుతుండడంలో ఆశ్చర్యమేముంది. సామాజిక మాధ్యమాలను కొందరు తమ స్వప్రయోజనాలకు.. మరికొందరు నేరాలు, ఘోరాలకు యథేచ్ఛగా వాడుకుంటున్నారు. మరోపక్క అవకాశాలను, అభివృద్ధికి, ఆదాయానికి, కాలక్షేపానికి ఉపయోగిస్తున్నారు. ఇందుకు సినిమా వాళ్లు సైతం అతీతం కాదు. తాజాగా సామాజిక మాధ్యమాల గురించి నేటి అనుకీర్తీ వాస్‌ ఏమంటున్నారో ఓ లుక్కేద్దాం.

అచ్చంగా తిరుచ్చి వాసి అయిన ఈ బ్యూటీకి మిస్‌ ఇండియా కిరీటం పెద్ద అలంకారం.  అదే ఇప్పుడు అనుకీర్తీవాస్‌కు హీరోయిన్‌ అవకాశాలను తెచ్చిపెడుతోంది. విజయ్‌ సేతుపతికి జంటగా డీఎస్పీ అన చిత్రంలో కథానాయకిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా తెలుగులో రవితేజ సరసన టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంలో నటించారు. ప్రస్తుతం వెట్ట్రి అనే మరో చిత్రంతో బిజీగా ఉన్నారు.

ఇప్పటి వరకు ఈ అమ్మడు చేసింది కొన్ని చిత్రాలే అయినా తరచూ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తూ నెటిజన్ల దృష్టిని తన వైపునకు తిప్పుకుంటోంది.  ఇటీవలే అనుకీర్తీ వాస్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల క్రితం తనకు సామాజిక మాధ్యమాలు అంటే ఏంటో తెలియదన్నారు. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రాముఖ్యత గురించి అనుభవపూర్వకంగా గ్రహించినట్లు పేర్కొన్నారు. హీరోయిన్‌ అవకాశం వచ్చినప్పుడల్లా మీ ఇన్‌స్ట్రాగామ్‌ ఐడీనీ పంపమని చెబుతున్నారన్నారు. అలా దాన్ని చూసే నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దీంతో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేస్తున్నట్లు నటి అనుకీర్తీవాస్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు