Vishal: సెన్సార్‌ బోర్డుకు లంచం.. విశాల్‌ వ్యవస్థనే కుదిపేశాడుగా!

21 Oct, 2023 14:39 IST|Sakshi

హీరో విశాల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం మార్క్‌ ఆంటోని. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేశారు. రిలీజ్‌కు ముందు మార్క్‌ ఆంటోని చిత్ర హిందీ వెర్షన్‌ను సెన్సార్‌ బోర్డుకు పంపగా అక్కడ సెన్సార్‌ సభ్యులు సర్టిఫికెట్‌ కావాలంటే రూ.6.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం సంచలనం సృష్టించింది. వారు అడిగినట్లుగానే విశాల్‌ డబ్బులు చెల్లించి సర్టిఫికెట్‌ తీసుకున్నారు. ఆ తర్వాత సెన్సార్‌ బోర్డు సభ్యులకు బ్యాంకు ద్వారా లంచం ఇచ్చినట్లు, దానికి సంబంధించిన బ్యాంక్‌ చలానా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. 

ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదుపై మహారాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని ముంబయి సీబీసీఐడీని కోరింది. సీబీసీఐడీ విచారణలో ముంబయి సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో వారిని సస్పెండ్‌ చేశారు.

సెన్సార్‌ సభ్యులకు లంచం ఇచ్చిన విశాల్‌ కార్యదర్శి హరికుమార్‌ను సీబీసీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. దీంతో హరికుమార్‌ శుక్రవారం అధికారుల ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. మరో విషయం ఏమిటంటే విశాల్‌ ఫిర్యాదు కారణంగా ఇప్పుడు తమిళం, తెలుగు సహా ప్రాంతీయ భాషల హిందీ అనువాద చిత్రాలకు చైన్నెలోనే సెన్సార్‌ సర్టిఫికెట్‌ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

చదవండి: ఆ వ్యాధుల వల్ల ఏ పనీ చేయలేకపోతున్నా.. ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా

మరిన్ని వార్తలు