మూడు భాషలను టార్గెట్‌ చేసిన ధనుష్‌

9 Dec, 2023 06:43 IST|Sakshi

బహుభాషా నటుడు ధనుష్‌ వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ హీరో కథానాయకుడిగా నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని 2024 సంక్రాంతి బరిలోకి దిగనుంది. పిరియడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈయన తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇది ఈయన దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం గమనార్హం. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ చిత్రంతో పాటు ధనుష్‌ తన 51వ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

దీనికి టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థ, అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్న నాయకిగా నటించనున్నారు. ఈమె ధనుష్‌ సరసన నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా ఈ చిత్రం మొదట తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నట్టు వార్త ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు హిందీలోనూ ఏకకాలంలో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కోలీవుడ్‌లో స్టార్‌ నటుడైన ధనుష్‌ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.

ఇక బాలీవుడ్‌లోనూ ఇప్పటికే రెండు చిత్రాలు చేశారు. దీంతో ఈయన 51వ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించాలని నిర్మాతలు ముందుగానే భావించినట్లు సమాచారం. ఇది రాజకీయ మాఫియా నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్ర షూటింగ్‌ జనవరిలో ముంబైలో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం.

>
మరిన్ని వార్తలు