నా సగం కల పూర్తయింది.. ఇంకో సగం మిగిలి ఉంది

31 Mar, 2021 01:50 IST|Sakshi

‘‘నేను తెలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాను. కానీ ఆ విషయం చాలామందికి తెలియదు. నాకు తెలుగులో అవకాశాలు రాకపోవడానికి ఇదొక కారణం కావొచ్చు. ‘వైల్డ్‌డాగ్‌’ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను’’ అని అన్నారు దియా మిర్జా. నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో ïకీలక పాత్ర చేసిన దియా మిర్జా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో చెప్పిన సంగతులు. ‘వైల్డ్‌డాగ్‌’కథ, నాగ్‌ సార్, డైరెక్టర్‌ ఇంట్రెస్ట్‌ చూసి ఈ సినిమా ఒప్పుకున్నాను. చాలా సంవత్సరాలుగా నాగ్‌ సార్‌ ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. నా చిన్నప్పుడు సుప్రియ (నాగార్జున మేనకోడలు, నటి–నిర్మాత) బొమ్మలతో నేను ఆడుకున్నాను.

నా ఫస్ట్‌ కిచెన్ సెట్‌ సుప్రియదే. నాగ్‌ సార్‌తో కలిసి నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. సినిమాలో ఆయనతో నా రిలేషన్ కథను ముందుకు తీసుకువెళ్తుంది. నేను తెలుగు అర్థం చేసుకోగలను. ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పాలనుకున్నాను. కానీ ఆ అవకాశం రాలేదు. నా పాత ఇంటర్వ్యూలను గమనిస్తే నా ఫేవరెట్‌ యాక్టర్స్‌ నాగ్‌ సార్, వెంకీ సార్‌ అని చెప్పేదాన్ని. ఇప్పుడు నాగ్‌ సార్‌తో నటించాను. నా సగం కల పూర్తయింది. ఇంకో సగం మిగిలి ఉంది (నవ్వుతూ). ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్, డైరెక్టర్స్, స్టోరీ టెల్లర్స్‌ ఉన్నారు. వీరందరికీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ మంచి అవకాశాలుగా కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ కోణాల్లో ఆలోచించి కథల విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం ఓటీటీకి ఉండదు.

మరిన్ని వార్తలు